వరంగల్ స్పోర్ట్స్: సీఎం రేవంత్రెడ్డి ప్రజా ప్రభుత్వం విద్య, వైద్యం తర్వాత క్రీడలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ నిధులు కేటాయిస్తోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని హ్యాండ్బాల్ కోర్ట్లో దివంగత ఏఆర్ డీఎస్పీ పీఎస్ శశిధర్ స్మారక 8వ తెలంగాణ రాష్ట్ర హ్యాండ్బాల్ టాలెంట్ హంట్ పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అండర్–15 బాలుర విభాగంలో మూడు రోజులపాటు జరగనున్న టోర్నమెంట్ను ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులనుంచి ఎమ్మెల్యే నాయిని గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం దివంగత డీఎస్పీ శశిధర్ చిత్రపటానికి పూలమాల వేసి, రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ఎమ్మెల్యే ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారుల సంక్షేమం, క్రీడల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, టాలెంట్ హంట్ నిర్వహణ కార్యదర్శి శ్యామల పవన్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 44 జట్లు రావాల్సి ఉండగా ఆర్టీసీ సమ్మె కారణంగా 25 జట్లు హాజరైనట్లు తెలిపారు. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలు నిర్వహించి ప్రతిభ గల క్రీడాకారులతో రాష్ట్ర జట్టును ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. అనంతరం జనగామ వర్సెస్ జైజవాన్, జైకిసాన్ పైడిపెల్లి జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. కార్యక్రమంలో హనుమకొండ డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బైరబోయిన కై లాస్యాదవ్, అధ్యక్షుడు అజీజ్ఖాన్, కోశాధికారి తోట శ్యామ్ప్రసాద్, హ్యాండ్బాల్ సంఘం జిల్లా అధ్యక్షుడు సాంబశివరావు, దివంగత ఏఆర్ డీఎస్పీ శశిధర్ సతీమణి మమత, అంతర్జాతీయ హ్యాండ్బాల్ క్రీడాకారుడు పోగుల అశోక్ పాల్గొన్నారు.
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి
అట్టహాసంగా హ్యాండ్బాల్ టాలెంట్ హంట్ ప్రారంభం


