గోవిందరావుపేట: నిరుపేద రైతుల భూసమస్యలు పరిష్కరించడానికే రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వం భూ భారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని, ఈ చట్టం ద్వారా ప్రతీ రైతుకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈమేరకు బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన భూభారతి సదస్సులో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, ములుగు కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ శబరీశ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ధరణి’తో రైతులు అనేక ఇబ్బందులకు గురయ్యారన్నారు. పేద రైతులకు కాకుండా పెద్ద రైతులకు న్యాయం జరిగిందన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టంలో ప్రతీ రైతు సమస్య పరిష్కరిస్తామన్నారు. ప్రతీ రైతుకు న్యాయం చేయడానికి అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని, తప్పు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రతీ రైతుకు పట్టా అందించాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్రెడ్డి అనేక అంశాలతో భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. రాష్ట్రంలోని రైతులందరూ తమ భూములపై హక్కులు పొందడానికి ఈ చట్టం దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్ రావు, ఆర్డీఓ వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.
అధికారులు తప్పు చేస్తే చర్యలు
రాష్ట్ర రెవెన్యూ శాఖ
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి