
గుర్తు తెలియని వృద్ధుడి ఆత్మహత్య
ఆత్మకూరు : గుర్తుతెలి యని వృద్ధుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని గుడెప్పాడ్ సమీపంలో చోటుచేసుకుంది. సీఐ సంతోశ్ కథనం ప్రకారం.. గుడెప్పాడ్ శివారులోని వ్యవసాయభూములకు వెళ్లే దారిలో ఓ వృద్ధుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు 70 నుంచి 80 ఏళ్లు ఉంటాడు. నీలి రంగు, తెలుపు గీతల హాఫ్ షర్టు, ఆకుపచ్చ రంగు గీతల గల్ల లుంగీ ధరించి ఉన్నాడు. మృతుడి ఎడమ కనుబొమ్మ దగ్గర పులిపిరి ఉంది. మృతుడి వివరాలు తెలిస్తే సంతోశ్(సీఐ) 8712685225 నంబర్, తిరుపతి(ఎస్సై) 8712685252 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
రేఖియానాయక్
తండాలో వృద్ధురాలు..
సంగెం: అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెందిన ఓ వృద్ధురాలు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సంగెం మండలం పోచమ్మతండా పరిధిలోని రేఖియానాయక్ తండాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన బానోత్ ద్వాలి(70),నాను దంపతులకు నరసింహ, భద్రు సంతానం. నాను చాలా కాలం క్రితం చనిపోయాడు. పెద్ద కుమారుడు నరసింహ ఏడాదిన్నర క్రితం చనిపోయాడు. ద్వాలి చిన్న కుమారుడు భద్రు వద్ద ఉంటోంది. ద్వాలికి రెండేళ్ల క్రితం పక్షవాతం వచ్చింది. ఎప్పటిలానే శనివారం రాత్రి అందరూ భోజనాలు చేసి నిద్రించారు. ఆదివారం తెల్లవారుజామున కోడలు రంగమ్మ లేచి కిచెన్లోకి వెళ్లి చూడగా ద్వాలి ఉరేసుకుని ఆత్మహత్యకు పా ల్పడి కనిపించింది. మృతురాలి మనవడు వీరన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎల్. నరేశ్ తెలిపారు.
రెడ్డిపాలెంలో కౌలు రైతు..
గీసుకొండ: అప్పల బాధతో వరంగల్ 15వ డివిజన్ రెడ్డిపాలెం గ్రామానికి చెందిన కౌలు రైతు వరగాని సత్యం(40) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కథనం ప్రకారం.. సత్యం కూలి పనులు చేస్తూ జీవించేవాడు. రెండేళ్ల నుంచి ఓ రైతు భూమిని కౌలుకు తీసుకు సాగు చేయగా పంటల దిగుబడి సరిగా రాకపోవడంతో పాటు అతడి భార్య వైద్య ఖర్చులు, పిల్లల చదువులు మొత్తం కలిపి రూ. 6 లక్షల అప్పు అయింది. ఈ అప్పు తీర్చలేని స్థితిలో ఈ నెల 1వ తేదీన పురుగుల మందుతాగాడు. గమనించిన బంధువులు వరంగల్ ఎంజీఎంలో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు గీసుకొండ సీఐ మహేందర్ ఆదివారం తెలిపారు.

గుర్తు తెలియని వృద్ధుడి ఆత్మహత్య