
పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
● మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
మరిపెడ: ప్రతీ పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరిపెడ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రుణమాఫీ చేశామన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు. ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి, ఈ రోజు అవి మంజూరు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్లు ఇచ్చామన్నారు. జూన్ చివరి వరకు రైతు భరోసా సొమ్ము రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే జాటోతు రాంచందర్నాయక్ చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల పట్లాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.