
వన మహోత్సవానికి వేళాయె..
మహబూబాబాద్: ప్రతీ సంవత్సరం వానాకాలం ప్రాంరభంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వనమహోత్సవ కార్యక్రమం చేపడుతోంది. వానలను దృష్టిలో పెట్టుకుని శాఖల వారీగా లక్ష్యాలను కేటా యించాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు శాఖల వారీగా లక్ష్యాల కేటాయింపులో అధికారులు నిమగ్నమయ్యారు. నర్సరీల్లో అందుబాటులో ఉన్న మొక్కలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో 50 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆశించిన స్థాయిలో వర్షాలు పడగానే మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు.
జిల్లాలో 5 మున్సిపాలిటీలు..
జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. కాగా మానుకోట మున్సిపాలిటీ పరిధి గాంధీపురంలో రెండు నర్సరీలు, కురవి రోడ్డులో నర్సరీ, రామచంద్రాపురంలో నర్సరీ ఉండగా.. కేవలం కురవి రోడ్డులో ఉన్న నర్సరీలో 60,000 మొక్కలు ఉన్నాయి. మన్సిపాలిటీలో 30,000 మొక్కలు మాత్రమే నాటడం లక్ష్యం కాగా.. ఇంకా 30,000 అదనంగా ఉన్నాయని సిబ్బంది తెలిపారు.
● మరిపెడ మున్సిపాలిటీ పరిఽధిలో రెండు నర్సరీలు ఉండగా మొక్కలు లేవు. అయితే గ్రీన్ టీం లేకపోవడంతో మొక్కల పెంపకం చేపట్టలేదని సిబ్బంది పేర్కొన్నారు.
● తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో రెండు నర్సరీ లు ఉండగా గ్రీన్ టీం లేక మొక్కలు పెంచలేదు.
● డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో రెండు నర్సరీలు ఉండగా ఒక నర్సరీలో మాత్రమే 42,000 మొక్కలు ఉన్నాయి. కౌన్సిల్ పదవి కాలం ముగియడంతో గ్రీన్ సభ్యులను తొలగించారు. నిర్వహణ బాధ్యత సిబ్బందికి అప్పగించారు.
● ఇటీవల కేసముద్రం మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయ్యింది. దాని పరిధిలో ఐదు గ్రామాలు ఉండగా ప్రతీ జీపీలో సర్సరీ ఉండగా.. వాటిలో మ్తొతం 42,000 మొక్కలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రతీ మున్సిపాలిటీ 30,000 మొక్కలు నాటాలని లక్ష్యం కాగా.. మొక్కలు లేని మున్సిపాలిటీలకు అటవీశాఖ ద్వారా సరఫరా చేయనున్నారు.
జిల్లాలో 482 జీపీలు.. 482 నర్సరీలు
జిల్లాలో 18 మండలాలు ఉండగా 482 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతీ గ్రామపంచాయతీ పరిధిలో ఒక నర్సరీ ఉంది. ప్రతీ నర్సరీలో 8,000నుంచి 10,000 మొక్కలు ఉన్నాయని పంచాయతీ కార్యదర్శులు పేర్కొన్నారు. ఆ నర్సరీల్లో ఉన్న మొక్కలు గ్రామాల్లో సరిపోతాయని, ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేస్తారు. మిగిలినవి రోడ్ల పక్కన, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల ఆవరణలో నాటనున్నారు. అలాగే అవెన్యూ ప్లాంటేషన్, ప్రకృతి వనాల్లో నాటనున్నారు.
మానుకోట మున్సిపల్ పరిధిలోని నర్సరీలో మొక్కలు
నర్సరీల్లో సిద్ధంగా మొక్కలు
ఆశించిన స్థాయిలో
వర్షాలు పడగానే నాటుడే..
జిల్లాలో 50లక్షల మొక్కల లక్ష్యం
శాఖల వారీగా కేటాయింపునకు కసరత్తు
లక్ష్యాలు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశాలు
కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో మే 31న కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె .వీరబ్రహ్మచారి, డీఎఫ్ఓ విశాల్, ఆర్డీఓలు కృష్ణవేణి, గణేశ్తో కలిసి సంబంధిత అధికారులతో వన మహోత్సవంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 50,13,500 మొక్కలు నాటే లక్ష్యం ఉందన్నారు. శాఖల వారీగా లక్ష్యాలను కేటాయించి, పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో సంబంధిత అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు.

వన మహోత్సవానికి వేళాయె..