
జీలుగ విత్తనాలు స్వాధీనం
తొర్రూరు: అక్రమంగా నిల్వ ఉన్న జీలుగ విత్తన బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం డివిజన్ కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ వివరాలు వెల్లడించారు. తొర్రూరు పట్టణానికి చెందిన చదలవాడ ఉపేందర్ అక్రమంగా జీలుగ పచ్చిరొట్ట విత్తనాలను సేకరించి బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు. జనగామ జిల్లా తరిగొప్పుల, బచ్చన్నపేట రైతు సేవా కేంద్రాల ఏజెంట్లు శ్రీనివాస్ రెడ్డి, సురేశ్ నుంచి క్వింటాకు రూ.8వేలు చెల్లించి 106 బస్తాల్లో రూ.4.50లక్షల విలువైన 63 క్వింటాళ్ల జీలుగ విత్తనాలను కొనుగోలు చేశాడు. ఆ విత్తనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా నర్సారావుపేటకు చెందిన వ్యాపారి శేషాద్రికి క్వింటాకు రూ.12 వేల చొప్పున విక్రయించేందుకు సిద్ధమయ్యాడు. ఈమేరకు తొర్రూరులోని తన ఇంట్లో అక్రమంగా నిల్వ చేయగా.. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు సోదాలు జరిపి బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు ఉపేందర్తో పాటు రైతుసేవా కేంద్రాల ఏజెంట్లు శ్రీనివాస్రెడ్డి, సురేశ్, డ్రైవర్లు భూక్య వీరన్న, బానోతు సురేశ్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. జీలుగ విత్తనాలతో పాటు రెండు వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.