
రైతులు ఆందోళన చెందొద్దు
● అదనపు కలెక్టర్ వీర బ్రహ్మచారి
నర్సింహులపేట: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చివరి దశకు చేరుకుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అదనపు కలెక్టర్(రెవెన్యూ) వీరబ్రహ్మచారి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, ధాన్యం నిల్వలు, బస్తాల తరలింపు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మండల కేంద్రంలో 200మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందని, రవాణాలో జాప్యం ఉన్నందున కాంట్రాక్టర్లు, రైస్ మిల్లర్లు, హమాలీలతో మాట్లాడి త్వరితగతిన తరలించాలన్నారు.కేంద్రాల్లో టార్పాలిన్లు, గన్నీ సంచులు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచుకొవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి ప్రేమ్కుమార్, సివిల్ సప్లయీస్ డీఎం కృష్ణవేణి, తహసీల్దార్ రమేశ్బాబు, ఏఓ వినయ్కుమార్ పాల్గొన్నారు.
ధాన్యం దిగుబడి పెరగడంతో ఆలస్యం..
తొర్రూరు రూరల్: గత ఏడాది కంటే ధాన్యం దిగుబడి పెరగడంతో కాంటాలు పెట్టడం ఆలస్యం అవుతుందని అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి అన్నారు. శుక్రవారం మండలంలోని అమ్మాపురం, మాటేడు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ప్రేమ్కుమార్, సివిల్ సప్లయీస్ డీఎం కృష్ణవేణి, తహసీల్దార్ శ్రీనివాస్, సొసైటీ, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
ధాన్యం తరలిస్తాం
దంతాలపల్లి: రైతులు అధైర్యపడొద్దని, ధాన్యం తరలిస్తామని అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి అన్నారు. మండలంలోని కుమ్మరికుంట్లలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించి కొనుగోలు కేంద్రాల్లో పోసిన ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేసి తరలించేందకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ వాహిని, ఏఈఓ దీక్షిత్, నిర్వాహకులు, రైతులు తదితరులు ఉన్నారు.