
రెవెన్యూ వసూళ్లు వందశాతం సాధించాలి
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ
కర్నాటి వరుణ్ రెడ్డి
హన్మకొండ: రెవెన్యూ వసూళ్లు వందశాతం సాధించాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. గురువారం రాత్రి హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్ఈ, డీఈ, ఎస్ఏఓలకు వీడియో కాన్ఫరెన్స్ (వీసీ) నిర్వహించారు. డివిజన్, జిల్లా వారీగా ప్రగతి సమీక్షించారు. ప్రధానంగా రెవెన్యూ వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. సర్కిళ్లు, డివిజన్ల, సెక్షన్ వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి రెవెన్యూ వసూళ్లు వంద శాతం సాధించేలా ప్రణాళిక రూపొందించుకుని ముందుకెళ్లాలని సూచించారు. విద్యుత్ చౌర్యం అరికట్టాలని చెప్పారు. రైతులు తమ మోటార్లకు కెపాసిటర్లు అమర్చుకునేలా అవగాహన కల్పించాలన్నారు. కేబుల్ ఆపరేటర్లు ఉపయోగించే విద్యుత్ స్తంభాలకు అద్దె వసూలు చేయాలని ఆదేశించారు. అలాగే, కేబుల్ ఆపరేటర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి, స్తంభాల వెంట గుత్తులుగా ఉన్న కేబుళ్లతో తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, క్రమపద్ధతిలో తీగలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డైరెక్టర్ వి. తిరుపతి రెడ్డి, 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, ఎస్ఏఓలు పాల్గొన్నారు.