
రైతులకు మేలు చేసేందుకు విత్తన చట్టం
● రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్
అన్వేశ్రెడ్డి
కాజీపేట అర్బన్ : రైతులకు మేలు చేసేందుకు విత్తన చట్టం ముసాయిదా తోడ్పడుతుందని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్రెడ్డి తెలిపారు. బుధవారం హనుమకొండ జెడ్పీ హాల్లో ఏర్పాటు చేసిన నూతన విత్తన చట్ట ముసాయిదా తయారీకి కమిటీల అభిప్రాయ సేకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో విత్తనోత్పత్తి చేస్తున్న రైతులు, పంటలు సాగు చేస్తున్న రైతులు నష్టపోకుండా ముసాయిదా ఏర్పాటు చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఎక్కువ అమ్ముడవుతున్న ట్రూత్ఫుల్ విత్తనాలకు బదులు సర్టిఫైడ్ సీడ్లను డీలర్లు రైతులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. భూభారతి చట్టం మాదిరి విత్తన చట్టం, మార్కెటింగ్ చట్టాల ముసాయిదా తయారు అవుతుందన్నారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్ధ ఆధ్వర్యంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా విడుదలైన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంటాయని, వరంగల్ టీ–సీడ్స్ కూడా అందుబాటులో ఉంటాయన్నారు. డీలర్లు రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు సునీల్కుమార్, నర్సింహారెడ్డి, శివప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, డీఏఓ రవీందర్సింగ్, తదితరులు పాల్గొన్నారు.