
భూమి రిజిస్ట్రేషన్ చేయడం లేదని దంపతుల ఆత్మహత్యాయత్నం
తరిగొప్పుల: తాము కొనుగోలు చేసిన భూమిని అమ్మకందారుడు రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేస్తూ తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారని దంపతులు శరీరంపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం మండల కేంద్రం శివారు ఎన్యానాయక్తండాలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా చిల్పూరు మండలం శ్రీపతిపల్లికి చెందిన జంగ రవి తరిగొప్పుల మండలం ఎన్యానాయక్తండాకు చెందిన ముడావత్ సంపత్నాయక్ వద్ద 2 సంవత్సరాల క్రితం 2 గుంటల భూమిని గుంటకు రూ.3.30 లక్షల చొప్పున కొనుగోలు చేశాడు. అయితే ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా సంపత్నాయక్ కాలయాపన చేస్తూ వస్తున్నాడు. దీంతో రవి పెద్దమనుషులను ఆశ్రయించగా 2 గుంటలకు బదులు మరోచోట 8 గుంటల భూమి ఇవ్వాలని రెండు రోజుల క్రితం తీర్మానం చేశారు. సంపత్నాయక్ మరోచోట 8 గుంటల భూమికి హద్దులు చూపించగా ఆ భూమిని రవి మంగళవారం ట్రాక్టర్తో దున్నాడు. ఈ క్రమంలో ఏమైందో తెలియదు కానీ బుధవారం ఉదయం రవి తన భార్య, బిడ్డతో సంపత్నాయక్ ఇంటికి వచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆ దంపతులను వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.