
తండ్రికి సాయం చేస్తూ మృత్యుఒడిలోకి..
డోర్నకల్: ఇంటిపనుల్లో తండ్రికి సాయం చేసే క్రమంలో ప్రమాదవశాత్తు ఓ బాలుడు ట్రాక్టర్కిందపడి మృతిచెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని పెరుమాళ్లసంకీస గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. డోర్నకల్ ఎస్సై గడ్డం ఉమ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పోగుల నర్సయ్య తన ఇంటిలో బాత్రూమ్ నిర్మాణానికి కావాల్సిన సైజురాయిని బుధవారం స్వంత ట్రాక్టర్ ద్వారా తీసుకొచ్చాడు. రాయిని కిందకు దింపేందుకు ట్రాక్టర్ను ఇంటి సమీపంలో ఒంపుగా ఉన్న ప్రాంతంలో నిలిపి టైరుకు అడ్డుగా రాయిపెట్టాడు. తర్వాత ట్రాక్టర్ను ముందుకు కదిలించే ప్రయత్నం చేస్తూ కుమారుడు పోగుల ఉమేష్(17)ను టైరుకు అడ్డుగా ఉన్న రాయిని తొలగించాలని సూచించాడు. ఉమేష్ రాయిని తొలగిస్తుండగా ట్రాక్టర్ ఒక్కసారిగా కదిలి టైర్లు ఉమేష్ మీదుగా వెళ్లడంతో తీవ్రగాయాలయ్యాయి. ఉమేష్ను ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. ఖమ్మంలోని ఓ కళాశాలలో పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఉమేష్ సెలవులకు ఇంటికి వచ్చి తండ్రికి పనుల్లో సహాయపడుతున్నాడు. కళ్లెదుటే కొడుకు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉమేష్ మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించి మృతుడి సోదరుడు గణేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమ తెలిపారు.
ట్రాక్టర్ కింద పడి బాలుడి మృతి