
వేర్వేరు కారణాలతో నలుగురి మృతి
● లారీ ఢీ.. కబడ్డీ క్రీడాకారుడి దుర్మరణం
దుగ్గొండి: మండలంలోని నాచినపల్లి గ్రామానికి చెందిన గోవిందు ఉదయ్కుమార్(23) లారీ ఢీకొని శనివారం రాత్రి మృతి చెందాడు. ఉదయ్ తండ్రి సమ్మయ్య పదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన ప్రాణం పోయే చివరి క్షణాలో లాయర్ కావాలని ఉదయ్ని కోరాడు. తండ్రి కోరిక మేరకు హనుమకొండలోని ఆదర్శ లా కాలేజీలో ఎల్ఎల్బీ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. మరోవైపు రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడాకారుడిగా ఎదిగాడు. మరో ఏడాదైతే లా పట్టా పుచ్చుకునే వాడు. ఈక్రమంలో శనివారం రాత్రి హనుమకొండ హంటర్ రోడ్డులో బైక్పై వెళ్తున్న ఉదయ్కుమార్ను లారీ ఢీకొట్టడంతో ఎగిరి డివైడర్ మీదపడి అతడు మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లి సరోజన రోదనలు మిన్నంటాయి. ఆదివారం ఉదయ్ మృతదేహం స్వగ్రామానికి తీసుకురాగా వందలాది మంది కబడ్డీ క్రీడాకారులు గిర్నిబావి నుంచి నాచినపల్లి వరకు 3 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహించారు. కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆర్. రాంరెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు కక్కెర్ల మల్లికార్జున్, పుప్పాల ఎల్లయ్య ఉదయ్ మృతదేహం వద్ద నివాళులు అర్పించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు.
రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్..
రఘునాథపల్లి: హనుమకొండ–హైదరాబాద్ జాతీయ రహదారిలోని కోమల్ల టోల్ ప్లాజా వద్ద శనివారం రఘునాథపల్లి మండలం గోవర్దనగిరి మాజీ సర్పంచ్ ముప్పిడి యాదగిరి (52) మృతి చెందాడు. యాదగిరి తన బైక్పై జనగామలో ఉన్న చెల్లెలి వద్దకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. కోమల్ల టోల్ ప్లాజా వద్ద ముందు వెళ్తున్న టాటా ఏస్ వాహనాన్ని డ్రైవర్ నిర్లక్ష్యంగా రోడ్డుపై నిలిపాడు. దీంతో బైక్పై వస్తున్న యాదగిరి టాటా ఏసీ వాహనాన్ని వెనకాల నుంచి ఢీకొట్టాడు. తీవ్ర గాయాలైన యాదగిరిని జనగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్కు తరలిస్తు్ండగా మార్గమధ్యలో మరణించాడు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడి కుమారుడు ప్రదీప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై దూదిమెట్ల నరేశ్ తెలిపారు.
తాటి చెట్టు నుంచి పడి గీత కార్మికుడు..
రాయపర్తి: మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన నాల్లం యాదగిరి(54) తాటిచెట్టు పైనుంచి పడి శనివారం సాయంత్రం మృతిచెందాడు. యాదగిరి వృత్తిని నమ్ముకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కల్లుగీస్తుండగా.. ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా రాత్రి 11:30 గంటలకు మృతిచెందాడు. ఆదివారం మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రవణ్కుమార్ తెలిపారు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం జరిగిన వివిధ ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు.
వడదెబ్బతో ఉపాధి కూలీ..
గూడూరు: వడదెబ్బతో మండలంలోని అప్పరాజ్పల్లికి చెందిన ఉపాధి కూలీ మండల సర్వయ్య (50) ఆదివారం మృతి చెందాడు. సర్వయ్య శనివారం ఉదయం గ్రామ సమీప రోడ్డు పక్కన గుంతలు తవ్వే పనులకు వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత పొద్దంతా ఎండ వేడితో, కడుపునొప్పితో బాధపడ్డాడు. రాత్రి నిద్రపోయి ఉదయం విగతజీవిగా మారాడు. తన భర్త వడదెబ్బతో చనిపోయాడని భార్య అన్నపూర్ణ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వేర్వేరు కారణాలతో నలుగురి మృతి

వేర్వేరు కారణాలతో నలుగురి మృతి

వేర్వేరు కారణాలతో నలుగురి మృతి