కోర్టు ఆదేశాలు బేఖాతర్‌ | - | Sakshi
Sakshi News home page

కోర్టు ఆదేశాలు బేఖాతర్‌

May 2 2025 12:43 AM | Updated on May 2 2025 12:43 AM

కోర్టు ఆదేశాలు బేఖాతర్‌

కోర్టు ఆదేశాలు బేఖాతర్‌

హన్మకొండ : సుప్రీం కోర్టు, హైకోర్టు తీర్పులు ఇచ్చినా టీజీ ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న తీరుపై విద్యుత్‌ కాంట్రాక్ట్‌ జూనియర్‌ లైన్‌మెన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 7,114 ఉద్యోగాల భర్తీకి 2006, జూన్‌ 8న ఒకసారి.. 2006 అక్టోబర్‌ 20న మరోసారి నోటిఫికేషన్‌ విడుదలైంది. పలువురు అర్హత పరీక్షకు హాజరై ఉద్యోగానికి అర్హత సాధించారు. ఏడాదిపాటు ప్రొబేషనరీ పీరియడ్‌తో మొదటి సారి 2007లో దాదాపు 1,564 మందిని కాంట్రాక్ట్‌ జూనియర్‌ లైన్‌మెన్లుగా, కోర్టుకు వెళ్లిన తర్వాత 2011లో దాదాపు 875 మందిని నియమించారు. నియామక ప్రక్రియలో కేవలం వయస్సును మాత్రమే ప్రామాణికంగా తీసుకుని భర్తీ చేపట్టడంతో అప్పటికే కాంట్రాక్ట్‌ పద్ధతిలో సబ్‌ స్టేషన్‌ ఆపరేటర్లుగా, ఇతర ఉద్యోగాలు చాలా రోజులుగా చేస్తున్న వారు నష్టపోయారు. దీంతో నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా మెరిట్‌ను పరిగణలోకి తీసుకోలేదని, నోటిఫికేషన్‌ ముందు కాంట్రాక్ట్‌ ఉద్యోగిగా ఎక్కువ పనిదినాలు నిర్వహించి, ఇంటర్వ్యూలో అర్హత సాధించిన తమను ఉద్యోగానికి ఎంపిక చేయలేదని అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. ద్విసభ్య ధర్మాసనం 2009 నవంబర్‌ 10న అర్హత కలిగి ఉన్న వారికి ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు క్లాజ్‌–6 (4)(సీ) ప్రకారం 2007, 2011లో ఉద్యోగం పొందిన అభ్యర్థులకు సర్వీస్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని విద్యుత్‌ సంస్థల యాజమాన్యాన్ని ఆదేశించింది. కోర్టు తీర్పు మేరకు 2011 ఆగస్టు 2న ఉద్యోగాలు ఇచ్చిన వీరికి సర్వీస్‌ బెనిఫిట్స్‌ మాత్రం కల్పించలేదు. దీంతో కోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా అమలు చేయలేదని ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తులు అభ్యర్థులకు సర్వీస్‌ బెనిఫిట్స్‌ వర్తింపజేయాలని తీర్పు ఇచ్చారు. అప్పటి ఎన్పీడీసీఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కార్తికేయ మిశ్రా నోటిఫికేషన్‌లో పేర్కొన్న మేరకు సీనియారిటీ జాబితా తయారు చేయాలని మెమో జారీ చేశారు. 2007, 2011లో నియామకమైన అభ్యర్థులందరితో సీనియారిటీ జాబితాను రూపొందించారు. కాంట్రా క్ట్‌ పద్ధతిలో పని చేసినప్పుడు తక్కువ పనిదినాలు ఉన్న వారికి నోటీసులు జారీ చేయగా వారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు 2019 ఫిబ్రవరి 25న తీర్పు ఇస్తూ 2009లో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని ఆదేశించగా, అభ్యర్థులు ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యానికి వినతి పత్రం అందించారు. నాటి నుంచి నేటి వరకు సీఎండీలు మారుతున్న తమకు మాత్రం న్యాయం జరుగడం లేదని 2011లో ఉద్యోగాలు పొందిన సీజేఎల్‌ఎంలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు 2011 నుంచి జీతం ఇవ్వాల్సి ఉండగా 2016 నుంచి మాత్రమే జీతం చెల్లిస్తున్నారని తెలిపారు. ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం మ్యాన్‌ డేస్‌ను కాకుండా పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకోవవడంతో మ్యాన్‌డేస్‌ (పని దినాలు) ఎక్కువగా ఉన్న వారు సీనియారిటీని కోల్పోతున్నారు. ఇప్పటికైనా యాజమాన్యం తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

పట్టించుకోని టీజీఎన్పీడీసీఎల్‌

యాజమాన్యం

సీజేఎల్‌ఎంలకు దక్కని ప్రయోజనాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement