
మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యం
● డీఎంహెచ్ఓ రవిరాథోడ్
గార్ల: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. గురువారం గార్ల సీహెచ్సీని ఆయన సందర్శంచారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. గార్ల ఆస్పత్రి వైద్య విధాన పరిషత్ పరిధిలోకి వెళ్లిందని, ఉత్తమ సేవలు అందిస్తామన్నారు. జిల్లాలో డిప్యుటేషన్ వ్యవస్థను రద్దు చేశామని, సిబ్బంది గతంలో పని చేసిన పీహెచ్సీకి వెళ్లాలని ఆదేశించినట్లు తెలిపారు. డిప్యుటేషన్ల వల్ల మారుమూల ఏజెన్సీ మండలాల్లోని పీహెచ్సీల్లో వైద్యులు, సిబ్బంది కొరతతో ప్రజలకు సక్రమంగా వైద్య సేవలు అందడం లేదన్నారు. జిల్లాలోని అన్ని పీహెచ్సీల్లో వైద్యులు, సిబ్బంది పోస్టులు భర్తీ అయిన తర్వాత, మిగిలిన వైద్యులు, సిబ్బందిని వైద్య విధాన పరిషత్ పరిధిలో కొనసాగుతున్న సీహెచ్సీలకు డిప్యుటేషన్పై పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. అనంతరం గార్ల సీహెచ్సీలో వైద్యుల పోస్టులను వెంటనే భర్తీ చేసి మండల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సీపీఎం జిల్లా నాయకులు కందునూరి శ్రీనివాసరావు, అలు వాల సత్యవతి డీఎంహెచ్ఓకు వినతిపత్రం అందజేశారు. వైద్యులు హనుమంతరావు, సిబ్బంది స్వాతి, రమాదేవి ఉన్నారు.