● ఒక ట్రాన్స్ఫార్మర్, 10 విద్యుత్ స్తంభాలు నేలమట్టం
పత్తికొండ రూరల్: గాలిమరలకు సంబంధించిన భారీ వాహనం హోసూరు గ్రామంలోకి రావడం, విద్యుత్ తీగలను బలంగా లాగడంతో ఒక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, 10విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. మొలగవల్లి రోడ్డు సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్తో పాటుగా దీనికి అనుసంధానంగా వరుసగా ఉండే విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు ఉదయం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఊరిబయట జరిగిన ఘటనలో ప్రాణనష్టం సంభవించలేదు. పెద్ద ప్రమాదం తప్పడంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు.


