ఊడుతున్న చక్రాలు..పనిచేయని స్టీరింగ్లు, పొలాలు, చెరువుల్లోకి దూసుకెళ్తున్న వాహనాలు కొన్ని..పొగలు కక్కుతున్నవి మరికొన్ని..కాలం చెల్లినవి ఇంకొన్ని వెరసి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణమంటే ఏదో తెలియని భయం. ఇది వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమనేవారు ఇప్పుడా పరిస్థితి లేదు. బస్సులు ఎక్కడ మొండికేసి మొరాయిస్తాయో తెలియని పరిస్థితి. కూటమి సర్కారు కాలం చెల్లిన బస్సులు, పాతవాటికి ౖపైపెన మరమ్మతులు చేసి తిప్పుతుండటమే దీనికి ప్రధాన కారణం. సోమవారం కడప నుంచి కర్నూలుకు బయలు దేరిన కడప డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు మార్గ మధ్యలోనే నిలిచిపోయింది. ఇంజన్ బెల్ట్, బెరింగు పోవడంతో ముందుకు కదలలేని పరిస్థితి. దీంతో ఈ బస్సులోని 60 మంది ప్రయాణికులు గమ్య స్థానాలకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ముందుగానే టికెట్లు తీసుకొని ఉండటంతో చేసేది లేక కడప వైపు నుంచి వచ్చిన పల్లెవెలుగు బస్సులు ఎక్కి వెళ్లారు. మహిళలకు, దివ్యాంగులకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించామని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు సర్కారు ముందుగా బస్సుల కండీషన్పై దృష్టిసారించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
– చాగలమర్రి


