మహిళపై టీడీపీ నాయకుడి దాడి
పగిడ్యాల: ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని పడమర ప్రాతకోట గ్రామంలో ఓ మహిళపై టీడీపీ నాయకుడు సగినేల రమణ దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి భర్త ప్రతాప్ తెలిపిన వివరాల మేరకు.. ప్రతాప్ కొంత కాలంగా అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాడు. ఆ ఇంటి ఆవరణలోని జామ చెట్టుకు ఉన్న కాయలను టీడీపీ నాయకుడు సగినేల రమణ తెంచుకుని, మళ్లీ తన అల్లుడు వినయ్ను పంపించాడు. ఆ సమయంలో ప్రతాప్ కొడుకు పార్థు.. తెంపొద్దు అని మందలించాడు. దీంతో కోపోద్రేక్తులైన మామా, అల్లుళ్లు ప్రతాప్ కుటుంబీకులపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అతని భార్య జ్యోతి కిందపడటంతో కాలికి గాయం కావడంతో నందికొట్కూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఎముక విరిగిందని చెప్పడంతో కర్నూలుకు తరలించారు. ఈ మేరకు ముచ్చుమర్రి స్టేషన్లో ప్రతాప్ ఫిర్యాదు చేయగా.. కేసు విచారించి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ నరేంద్ర తెలిపారు.
మృతుల కుటుంబాలకు అతిథి గృహంలో విడిది
కర్నూలు(సెంట్రల్): కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున దహనమైన బస్సులో మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో విడిది ఏర్పాటు చేశారు. వారికి అక్కడే భోజనం, వసతిని అధికారులు కల్పించారు. కాగా, చనిపోయిన 19 మందిలో 18 మంది కుటుంబీకులు డీఎన్ఏ శాంపిల్స్ ఇచ్చారు. 48 గంటల తరువాత ఆ డీఎన్ఏలకు సంబంధించి ఫలితాలు రానుండడంతో అంత వరకు వచ్చిన కుటుంబసభ్యులకు అధికార యంత్రాంగమే విడిది ఏర్పాటు చేసింది.
నీటి కుంటలో పడి బాలుడి మృతి
చాగలమర్రి: గొట్లూరు గ్రామానికి చెందిన దూదేకుల ధర్మతేజ(15) శనివారం ప్రమాదవశాత్తూ నీటి కుంటలో పడి మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన దూదేకుల బాల దస్తగిరి, సిద్దేశ్వరి దంపతులకు కుమార్తె, ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు ధర్మతేజ శనివారం ఉదయం గ్రామ పొలిమేరలోని బీడు పొలాలో పశువులను మేపేందుకు వెళ్లాడు. అక్కడ తోటి స్నేహితులతో ఆడుకుంటూ పక్కనే ఉన్న కుంటలో ప్రమాదవశాత్తూ కాలుజారి పడిపోయాడు. కుంటలో నీరు నిండుగా ఉండటంతో నీళ్లలో మునిగి పోయాడు. వెంటనే స్నేహితులు పరుగున వెళ్లి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని నీళ్లలో ముగినపోయిన ధర్మతేజను బయటికి తీశారు. వెంటనే చికిత్స నిమిత్తం చాగలమర్రిలోని కేరళ వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి బాలుడు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. స్థానిక ఎస్ఐ సురేష్ ఆసుపత్రికి చేరుకొని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
న్యూసెన్స్ కేసులో జైలు శిక్ష
శిరివెళ్ల: బోయిలకుంట్లకు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తికి న్యూసెన్స్ కేసులో 14 రోజుల జైలు శిక్ష పడిందని ఎస్ఐ చిన్న పీరయ్య శనివారం తెలిపారు. మద్యం తాగి గ్రామంలో న్యూసెన్స్ సృిష్టించి ప్రజలకు ఇబ్బందులకు గురి చేయడంతో కేసు నమోదు చేసి ఆళ్లగడ్డ కోర్టులో హాజరు పరిచామన్నారు. విచారణ చేసి జడ్జి నిందితుడికి జైలు శిక్ష విధించారన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, అల్లర్లు సృష్టించడం, ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.
మహిళపై టీడీపీ నాయకుడి దాడి


