
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
కోసిగి: చిన్న భూంపల్లి గ్రామానికి చెందిన దుద్ది రామలక్ష్మీ (50) అనే మహిళను దారుణంగా హత్య చేసిన భర్త నరసింహులును పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో సీఐ మంజునాథ్, ఎస్ఐ హనుమంత రెడ్డి సోమ వారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. గత నెల 30వ తేదీన నరసింహులు మద్యం తాగి భార్య రామలక్ష్మితో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో భార్య తలపై భర్త రోకలిబండతో మోదడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందింది. మృతుడి కుమారుడు ఉసేన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సోమవారం ఉదయం గ్రామ శివారులోని ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ఉన్న నిందితుడు నరసింహులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు.
క్రషర్లో యువకుడి మృతి
కర్నూలు (రూరల్): ఇ.తాండ్రపాడు గ్రామంలో కంకర క్రషర్లో జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిటన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తర ప్రదేశ్ ప్రాంతానికి చెందిన అన్సర్ (18) స్థానిక స్టోన్ క్రషర్లో కొన్నాళ్లుగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం క్రషర్లో పని చేస్తుండగా అక్కడ ఉన్న వాహనం రివర్స్ అయ్యే క్రమంలో డ్రైవర్ గమనించకపోవడంతో ప్రమాదవశాత్తూ అన్సర్ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతుని సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కర్నూలు అర్బన్ పోలీసులు సోమవారం తెలిపారు.
ఆటో అదుపు తప్పి బోల్తా
పత్తికొండ రూరల్: పత్తికొండ–ఆదోని రోడ్డులోని దర్గా సమీపంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఆస్పరి మండలం చిరుమాన్దొడ్డికి చెందిన రైతులు కూరగాయలను విక్రయించి ఆటోలో తిరిగి ప్రయాణమయ్యారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో బాలముని, సుంకన్న, ఈరన్న, రాజు, బాలరాజు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం స్థానికులు పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సలహా మేరకు కుటుంబీకులు కర్నూలుకు తరలించారు.
అంతర్రాష్ట్ర
సెల్ఫోన్ దొంగల అరెస్ట్
● రూ.8లక్షలు విలువైన
56 ఫోన్లు స్వాధీనం
కోడుమూరు రూరల్: నలుగురు అంతర్రాష్ట్ర సెల్ఫోన్ల దొంగలను కోడుమూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.8 లక్షల విలువైన 56 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం సాయంత్రం కోడుమూరు సీఐ తబ్రేజ్ విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నంద్యాల జిల్లా డోన్ మండలం చిగుర్మాన్పేటకు చెందిన ఎరుకలి శశికుమార్, శ్రీను మరో ఇద్దరు మైనర్లతో కలసి ముఠాగా ఏర్పడ్డారు. నలుగురు తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని రద్దీ ప్రాంతాల్లో చాకచక్యంగా సెల్ఫోన్లను దొంగలించి వాటిని అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసే వారన్నారు. అనుమానంతో వీరిపై నిఘా పెట్టామన్నారు. సోమవారం ఉదయం కోడుమూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్నారని సమాచారం రావడంతో ఎస్ఐ ఎర్రిస్వామితో కలిసి నలుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న 56 సెల్ఫోన్లన్ని కర్ణాటకలోని బళ్లారి, చిక్ బళ్లాపూర్, హొస్పేట్, బెంగళూరు ప్రాంతాల్లో దొంగలించినట్లు విచారణలో తేలిందన్నారు. స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లన్నింటిని ఐఎంఈఐ నంబర్ల ఆధారంగా బాధితులను పిలిపించి త్వరలో అందజేస్తామన్నారు. సమావేశంలో ఎస్ఐ ఎర్రిస్వామి, ట్రైనీ ఎస్ఐ నీలకంఠ, సిబ్బంది పాల్గొన్నారు.