
సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో రాజకీయం
కీలకంగా నేతల సిఫారసు లేఖలు
● చిరుద్యోగుల జేబులు ఖాళీ చేస్తున్న చోటా కూటమి నేతలు ● వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా బదిలీలు, నియామకాలు ● బదిలీల దరఖాస్తుకు ముగిసిన గడువు ● జిల్లాలో మొత్తం 5,562 మంది సచివాలయ ఉద్యోగులు ● వీరిలో 3,619 మందికి ఒకే ప్రాంతంలో ఐదేళ్ల సర్వీసు పూర్తి
కర్నూలు(అర్బన్): గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో జిల్లాలో రాజకీయ పైరవీలు ఊపందుకున్నాయి. నిబంధనల మేరకు ఐదేళ్లు ఒకే ప్రాంతంలో విధులు నిర్వహించిన వారిని బదిలీ చేయాలని, అలాగే ఐదేళ్లు పూర్తి కాకున్నా.. రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ కోరుకునే వారికి అవకాశం కల్పించనున్నారు. ఈ నేఫథ్యంలోనే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ అంశం చోటా కూటమి నేతలకు కాసులు కురిపిస్తోంది. సొంత మండలాల్లో ఐదేళ్లు విధులు నిర్వహించిన పలువురు ఉద్యోగులు తమకు సమీపంలోని సచివాలయాలకు బదిలీ అయ్యేందుకు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల సిఫారసు లేఖల కోసం క్యూ కడుతున్నారు. నేరుగా ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల వద్దకు పోయే సాహసం చేయలేని అనేక మంది ఉద్యోగులు నేతల అనుచరులను ముందుగా ప్రసన్నం చేసుకునేందుకు చేతులు తడుపుతున్నారు. ఇదే అదనుగా భావించిన చోటా నేతలు బరితెగించి చిరుద్యోగుల జేబులను ఖాళీ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం అన్నీ సక్రమంగా ఉన్నా, నేతల సిఫారసు లేఖలు లేకుంటే జిల్లాలోని సుదూర ప్రాంతాల్లోని సచివాలయాలకు బదిలీ అయ్యే ప్రమాదం ఉంటుందనే భయంతో వారు అడిగినంత ముట్టజెబుతున్నట్లు తెలుస్తోంది. గ్రామ సచివాలయాల ఉద్యోగులకు సంబంధించి సొంత మండలాల్లో పనిచేసే వెసులుబాటును తొలగించి, వేరే మండలాలకు వీరిని బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే నిబంధనల ప్రకారం బదిలీలు జరుగుతాయా? సిఫారుసుల మేరకు జరుగుతాయా? అనే ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది. గత వైఎస్సార్సీపీ పాలనలో ఎలాంటి రాజకీయ పైరవీలు, అవినీతికి తావు లేకుండా ఎంతో పారదర్శకంగా బదిలీలు, నియామకాలు జరిగాయని ఉద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు.
ముగిసిన గడువు
గ్రామ/వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు బదిలీలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 22 నుంచి 24వ తేది వరకు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే అర్హత కలిగిన వారందరూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో మొత్తం 5,569 మంది గ్రామ/ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఉండగా, వీరిలో ఐదు సంవత్సరాలు ఒకే ప్రాంతంలో విధులు నిర్వహించిన వారు 3,619 మంది ఉన్నారు. అందిన సమాచారం మేరకు మాడ్యూల్లో 3,299 మంది ఉద్యోగుల డాటాను అప్లోడ్ చేశారు.
వార్డు సచివాలయాల్లో గందరగోళం
● ప్రస్తుత బదిలీల్లో వార్డు సచివాలయ ఉద్యోగుల్లో కొంత గందరగోళం నెలకొన్నట్లు తెలుస్తోంది.
● ఉద్యోగంలో చేరినప్పటి నుంచి కొందరు తమకు కేటాయించిన సచివాలయాల్లోనే విధులు నిర్వహిస్తున్నారు.
● మరి కొందరు రెండేళ్ల క్రితం అంతర్గత బదిలీల్లో భాగంగా ఇతర వార్డుల్లోని సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్నారు.
● ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఐదేళ్లు ప్రామాణికంగా తీసుకుంటారా? లేక అంతర్గత బదిలీలను తీసుకుంటారా? అనే విషయంలో సందిగ్ధం నెలకొంది.
● అలాగే ర్యాంకుల ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహిస్తారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
●ఉద్యోగులు సొంత వార్డు పరిధిలో కాకుండా ఆ పట్టణంలో నే ఇతర వార్డులకు లేదా ఉమ్మడి జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలు,కార్పొరేషన్లకు బదిలీపై వెళ్లేందుకు అర్హులని చెప్పింది.
● అయితే గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు సొంత మండలాలకు బదిలీ అయ్యే అవకాశం కల్పించకపోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
సొంత మండలాల్లోనే అవకాశమివ్వండి
తుగ్గలి: సొంత మండలాల్లో బదిలీ అవకాశం కల్పించాలని సచివాలయ ఉద్యోగులు కోరారు. ఈ మేరకు గ్రామ వెల్ఫేర్ అసిస్టెంట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పులిశేఖర్, అన్ని శాఖల సచివాలయ ఉద్యోగులు మంగళవారం ఎంపీడీఓ కార్యాలయ ఏఓ మహబూబ్బాషా, డిప్యూటీ తహసీల్దార్ సుదర్శన్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శుల బదిలీలపై ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులతో వేలాది మందికి ఇబ్బందులు తప్పవన్నారు. ప్రభుత్వ జీవో 5 వల్ల ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. ప్రమోషన్లు ఇచ్చిన తర్వాత రేషనలైజేషన్ చేసి బదిలీలు చేపట్టాలని, సొంత ప్రాంతాల్లో అవకాశం కల్పిస్తూ జీఓను సవరించాలని డిమాండ్ చేశారు.