
శాంతియుత ఉద్యమాలను కొనసాగిస్తాం
కర్నూలు(అర్బన్): వక్ఫ్ సవరణ చట్టం వెనక్కు తీసుకునే వరకు శాంతియుతంగా ఉద్యమాలను చేస్తూనే ఉంటామని సేవ్ వక్ఫ్ సేవ్ కాన్స్టిట్యూషన్ జేఏసీ నేతలు ప్రకటించారు. మంగళవారం ఉదయం స్థానిక ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఈ నెల 30న నిర్వహించనున్న బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ సయ్యద్ జాకీర్ అహ్మద్ రషాదీ, కో కన్వీనర్ ఎంఏ హమీద్, నాయకులు షరీఫ్, షౌకత్ఆలీ, పాదిక్ ఆలీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ముస్లింలపై తమకున్న వివక్షతో శతాబ్దాల నాటి వక్ఫ్ చట్టాన్ని సమూలంగా మార్చి ఉమీద్గా నామకరణం చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో అనేక స్వచ్ఛంద సంస్థలు, అన్ని రాజకీయ పార్టీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ఆధ్వర్యంలో గత ఏడాది నుంచి అనేక నిరసన కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వంలో ఎలాంటి స్పందన కనిపించడం లేదన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించామన్నారు. కేంద్రం వైఖరికి నిరసనగా ఈ నెల 30న సాయంత్రం 5 నుంచి రాత్ర 9.30 గంటల వరకు స్థానిక ఎస్టీబీసీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సభకు అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు.
సేవ్ వక్ఫ్ సేవ్
కాన్స్టిట్యూషన్ జేఏసీ