
పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు
కర్నూలు (టౌన్): పార్టీ కోసం పనిచేసే వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల వైఎస్సార్సీపీ అంగన్వాడీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన రెడ్డి మంజులత ఆదివారం స్థానిక గిప్సన్ కాలనీలో పార్టీ జిల్లా అధ్యక్షుడిని కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తు వైఎస్సార్సీపీదేనని, ఏడాదిలోపే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. మహిళలు సైతం మోసపోయామన్న భావనకు వచ్చారన్నారు. అన్ని వర్గాలకు ఆశలు కల్పించి నిరాశకు గురిచేసిన చంద్రబాబు సర్కారుకు గుణపాఠం తప్పదన్నారు. ప్రస్తుతం ప్రజలు జగనన్న పాలనను గుర్తుకు తెచ్చుకుంటున్నారన్నారు. ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటికి చేర్చిన ఘనత ఆయనదని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు సర్కారు అలా చేయకపోగా ప్రశ్నించే తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసి ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాలని, హామీల అమలుకు ప్రభుత్వ మెడలు వంచుదామని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ఎస్వీ యూత్ పాల్గొన్నారు.