
ఐదేళ్ల అభివృద్ధి టీడీపీ నేతలకు కనిపించదు
బేతంచెర్ల: డోన్ నియోజకవర్గంలో గత వైఎస్సార్సీపీ పాలనలో జరిగిన ఐదేళ్ల అభివృద్ధిని టీడీపీ నేతలు కళ్లుండి చూడలేని కబోదుల్లా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. గురువారం గోరుమానుకొండ గ్రామ సమీపంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల, ఎంఎస్ఎంఈ భవనాలను నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ. కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఈ భవనాలను టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా వినియోగంలోకి తీసుకు రాలేకపోవడం దారుణం అన్నారు. గ్రామీణ, పట్టణ విద్యార్థులకు విద్యతో పాటు సాంకేతిక రంగాల్లో రాణించాలని ముందు చూపుతో ఐటీఐ, ఎంఎస్ఎంఈ, బీసీ బాలుర రెసిడెన్షియల్ స్కూలు మంజూరు చేయించి పఫ్షీట్లతో నిర్మాణాలు చేపడితే వాటిపై కూడా టీడీపీ నాయకులు విమర్శలు చేయడం అవివేకమన్నారు. రేకులకు, పఫ్ షీట్లకు తేడా తెలియని స్థితిలో వారున్నారన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం చెత్త రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. చేతనైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు చేసి మాట్లాడాలన్నారు. అనంతరం బీసీ బాలుర రెసిడెన్షియల్ స్కూల్ భవనాన్ని పరిశీలించారు. ఎంత మంది విద్యార్థులు ఉన్నారు, సౌకర్యాలు ఏవిధంగా ఉన్నాయని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. త్రీఫేజ్ విద్యుత్ సరఫరా లేకపోవడంతో తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విన్నవించారు. సంపద సృష్టించే సీఎం, బీసీల కోసం పుట్టిన పార్టీ అని చెప్పుకుంటున్న టీడీపీ నేతలు బీసీ రెసిడెన్సియల్ స్కూల్లో విద్యార్థులకు టేబుళ్లు, విద్యుత్ సౌకర్యం ఎందుకు కల్పించలేకపోతున్నారని ప్రశ్నించారు . ఇప్పటికై నా టీడీపీ నాయకులకు చిత్త శుద్ధి ఉంటే ఈ భవనాల్లో సౌకర్యాలు మెరుగు పరిచి వినియోగంలోకి తేవాలన్నారు. బుగ్గన వెంట ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ చలం రెడ్డి, రాష్ట్ర మాజీ ఉర్దూ అకాడమీ, స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరక్టర్లు ముర్తుజావలి, ఖాజా హుసేన్, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రుడు, నాయకులు తిరుమలేశ్వర్రెడ్డి, గూని నాగరాజు, తిమ్మయ్య, ఎద్దులన్న,భాస్కర్ పాల్గొన్నారు.
చెత్త రాజకీయాలు ఇంకెన్నాళ్లు చేస్తారు
చేతనైతే హామీలు అమలు చేయండి
మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి