
జిల్లా అంతటా పోలీసుల విస్తృత తనిఖీలు
కర్నూలు: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు జిల్లా అంతటా విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు సబ్ డివిజన్ అధికారుల నేతృత్వంలో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, లాడ్జీలు, దేవస్థానాలు, దర్గాలు, వ్యాపార సముదాయాలు, షాపింగ్ మాల్స్లలో శనివారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఏకకాలంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. కర్నూలులో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు కూడా తనిఖీల్లో పాల్గొన్నాయి. కర్నూలు నగరంలో ముఖ్యమైన కూడళ్లతో పాటు కిడ్స్ వరల్డ్, రాజ్విహార్, ప్రభుత్వాసుపత్రి, సి.క్యాంప్, రైల్వేస్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
మంత్రాలయంలో..
మంత్రాలయం: కశ్మీర్ పహల్గామ్లో ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో శనివారం మంత్రాలయంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బాంబు, డాగ్ స్క్వాడ్ బృందంతో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం, గంగమ్మ గుడి, ఆంజనేయ స్వామి ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో తనిఖీలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి మంత్రాలయానికి వచ్చే బస్సులు, కార్లు, తదితర వాహనాలకు క్షుణ్ణంగా పరిశీలించారు. మంత్రాలయం మండలంలోని తుంగభద్ర రేల్వేస్టేషన్లో తనిఖీలు నిర్వహించారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సీఐ రామాంజులు, ఎస్ఐ శివాంజల్ సూచించారు.

జిల్లా అంతటా పోలీసుల విస్తృత తనిఖీలు