
కార్పొరేషన్లో బిల్లు బిల్లుకీ పర్సంటేజీ
● ఓ మంత్రి వద్ద పనిచేసే ఉద్యోగి,
తెలుగు తమ్ముళ్ల దందా తోడు
● గగ్గోలు పెడుతున్న మున్సిపల్
కాంట్రాక్టర్లు
● కమిషనర్పై సీఎంకు, మంత్రులు,
ఎమ్మెల్యేలు, అధికారులకు ఫిర్యాదు
● రూ.60 కోట్ల బిల్లులకు ఇచ్చింది
రూ.15 కోట్లే
● అదీ పర్సంటేజీలు ఇచ్చిన వారికే
మంజూరు
కర్నూలు(టౌన్): కర్నూలు నగరపాలక సంస్థలో కమీషన్ల దందా మితిమీరిపోయింది. కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించాలంటే 8 శాతం పర్సంటేజి ఇవ్వాల్సిందే. లేదంటే కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే. వీరికి తోడు ఓ మంత్రి వద్ద పనిచేసే పీఏ స్థాయి ఉద్యోగి, కార్పొరేషన్లో పనిచేసే ఒకరిద్దరు తెలుగు తమ్ముళ్ల పైరవీలు సరేసరి. బిల్లుల క్లియరెన్స్లో వీరే మధ్యవర్తులు. ఆ పీఏ స్థాయి ఉద్యోగి సైతం మంత్రికి సంబంధించిన పనులైతే వెంటనే క్లియర్ అవుతాయి. జనరల్ ఫండ్ కింద చేసిన పనుల బిల్లులూ ఇవ్వడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ‘ఏడాది అవుతుంది. మేము చేసిన అభివృద్ధి పనుల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అప్పుల్లోకి వెళ్లిపోయాం. బిల్లులు క్లియర్ కావాలంటే 8 శాతం పర్సంటేజీ డిమాండ్ చేస్తున్నారు. అంత ఇచ్చుకోలేం. మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబుపై తగిన చర్యలు తీసుకోవాలి’ అంటూ కర్నూలు కార్పొరేషన్ కాంట్రాక్టర్ల వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కలెక్టర్ నుంచి సీఎం వరకు అందరికీ ఫిర్యాదు చేశారు.
కాంట్రాక్టర్లకు చుక్కలు
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.60 కోట్ల విలువైన పనుల బిల్లులు రాగా, అందులో దాదాపు రూ.15 కోట్ల వరకు నగరపాలక సంస్థ అధికారులు క్లియర్ చేశారు. వీటిలో అధిక శాతం అధికారుల పర్సంటేజీలు, ఇతరత్రా ముడుపులు ఇచ్చుకున్న వారికే బిల్లులు అందాయనే విమర్శలు ఉన్నాయి. కొంత మంది కాంట్రాక్టర్లు గట్టిగా మాట్లాడి రూ.2 కోట్ల వరకు బిల్లులు తీసుకున్నారు. ఇటీవల ప్రభుత్వం నుంచి మరో రూ.17 కోట్లు విడుదల చేశారు. దీంతో పైరవీలు, ఒత్తిళ్లు పెరిగాయి. అయినా ఇప్పటివరకు ఒక్క బిల్లు కూడా సీఎఫ్ఎంఎస్ ( కాంప్రెసీవ్ ఫైనాన్షియల్ మానటరింగ్ సిస్టమ్ ) నమోదు చేయలేదు. జీజీఎంపీ (గడప, గడపకు మన ప్రభుత్వం) బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. సకాలంలో బిల్లులు రాక, అప్పులు చేసి పనులు చేయడంతో ఆ ఒత్తిడి తాళలేక ఓ మున్సిపల్ కాంట్రాక్టరు గత నెలలో గుండెపోటుతో ఆసుపత్రి పాలయ్యాడు. పనుల టెండర్ దశ నుంచి అగ్రిమెంటు, ఆ తరువాత బిల్లుల చెల్లింపుల వరకు కాంట్రాక్టర్లకు సినిమా కనిపిస్తుంది.