
క్యాన్సర్ ఆస్పత్రిలో కార్పొరేట్ స్థాయి సేవలు
కర్నూలు (హాస్పిటల్): కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో అత్యాధునిక పరికరాలు, వసతులతో రోగులకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. శనివారం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో లీనియర్ ఆక్సిలరేటర్, సీటీ సిమ్యులేటర్, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, మెడికల్ ఆంకాలజీ వార్డులను భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్తో కలిసి ఆయన ప్రారంభించారు. పలువురు రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న సేవలను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ వెనుకబడిన, కరువు ప్రాంతమైన రాయలసీమ ప్రజలు క్యాన్సర్ వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కర్నూలుకు ఈ ఆస్పత్రిని కేటాయించిందన్నారు. త్వరలోనే పూర్తిస్థాయి వైద్యులు, సిబ్బందిని నియమిస్తామన్నారు. అనంతరం ఆయన రోగుల విభాగాన్ని, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ విభాగాలను సందర్శించి అక్కడి వసతులు, సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో మెడికల్ కాలేజిలోని క్లినికల్ లెక్చరర్ గ్యాలరీలో సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం, కోడుమూరు ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, దస్తగిరి, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ శ్రీనివాసరావు, అకడమిక్ డీఎంఈ డాక్టర్ రఘునందన్, డీఎంహెచ్వో డాక్టర్ పి.శాంతికళ, మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సీఎస్కే ప్రకాష్ పాల్గొన్నారు.
అబద్ధాలు వల్లె వేసిన మంత్రి
● స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు వచ్చిన మంత్రి సత్యకుమా ర్ అబద్ధాలు వల్లె వేశారు. క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి 2019లో ఎన్డీఏ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.
● ఐదేళ్లు వైఎస్సార్సీపీ అధికారంలో ప్రభుత్వం పట్టించుకోవడంతో 2024 మార్చి నాటికి భవననిర్మాణం పూర్తయ్యింది.
● ఆ ప్రభుత్వ హయాంలోనే రూ.కోట్ల విలువైన లీనియర్ యాక్సిలరేటర్, సీటీ సిమ్యులేటర్ యంత్రాలు వచ్చాయి.
● కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకు కూడా ఈ ఆస్పత్రిని పట్టించుకోలేదు.
● మీడియాలో కథనాలు రావడంతో స్పందించి వసతులు, సౌకర్యాలు కల్పించింది.
● ఇప్పుడు భవనమంతా తామే నిర్మించినట్లు చెప్పుకోవడంపై వైద్యులు, ఇక్కడి ప్రజలు ఇదేం చోద్యమంటూ ముక్కున వేలేసుకున్నారు.
● బోధనాస్పత్రుల్లో వైద్యుల ఖాళీలు 40 శాతం ఉండేవని, అధికారంలోకి వచ్చిన తర్వాత 6 శాతానికి తగ్గించా మని చెప్పుకోవడంపైనా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
●కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడా నియామకాలు చేపట్టలేదని బాహాటంగానే విమర్శిస్తున్నారు.
రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్