ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరిగే నిత్యాన్నదానానికి శనివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. హైదరా బాద్ మోతీనగర్కు చెందిన పి.రజనీకాంత్ శర్మ ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధి కారులను కలిసి వేలంమర్రి సాంబశివ శర్మ, పద్మావతి పేరిట నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం అందజేశారు. బాపట్ల జిల్లా రేపల్లె రైలుపేటకు చెందిన ద్రోణవజ్జల బ్రహ్మ అవధాని దంపతులు, విజయవాడ సూర్యా పేటకు చెందిన బమిడిపాటి శ్రీమన్నారాయణ కుటుంబం, బమిడిపాటి శారద కుటుంబం రూ.లక్ష చొప్పున విరాళాలు అందజేశాయి. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం, ఆలయ ఏఈఓ వెంకటరెడ్డి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
గన్నవరం: తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్యాన్నదాన కార్యక్రమానికి గన్నవరానికి చెందిన శ్రీవారి భక్త సమాజం ఆధ్వర్యంలో పది టన్నుల కూరగాయలను శనివారం లారీల్లో తరలించారు. తొలుత కూరగాయల వాహనాన్ని తహసీల్దారు కె.వెంకటశివయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీవారి భక్త సమాజం ప్రతినిధి మండవ వెంకటప్రభాకరరావు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు శ్రీవారి భక్త సమాజం ద్వారా 21 టన్నుల కూరగాయలను టీటీడీకి అందజేశామన్నారు. వ్యవసాయ అధికారి శివప్రసాద్, ఎంపీటీసీ సభ్యులు పడమట రంగారావు, మాజీ ఉపసర్పంచ్లు జాస్తి శ్రీధర్, పాలడుగు నాని, పుర ప్రముఖులు నెక్కలపూడి ఈశ్వర రావు, టి.ఎస్.ఆర్.కె.ప్రసాద్, గూడపాటి సీతారాంబాబు, తుమ్మల మురళీకృష్ణ పాల్గొన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్ డిజిటల్ టెక్నాలజీ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో రెండు రోజులు నిర్వహించనున్న ఏఐ సమ్మిట్ శనివారం విజయవాడలో ప్రారంభమైంది. బృందావన కాలనీలో ఏ కన్వెన్షన్లో నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ను మంత్రి కొల్లు రవీంద్ర జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచాన్ని టెక్నాలజీ నడిపిస్తోందన్నారు. టెక్నాలజీపై పట్టు సాధిస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందొచ్చన్నారు. ఏపీ డిజిటల్ టెక్నాలజీ ఇండస్ట్రీ నెట్వర్క్ చైర్మన్ శ్రీధర్ కొసరాజు మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో అన్ని రంగాల్లో మార్పులు వస్తున్నాయన్నారు. కార్పొరేట్ రంగంలో ఏఐ ద్వారా ఎలా పనిచేయాలనేది ఇండస్ట్రీ హెడ్స్ వివరిస్తారని, విద్యార్థులు, యువతకు ఇది సువర్ణావకాశమని పేర్కొన్నారు. సదస్సులో స్టార్టప్ కంపెనీల ప్రతినిధులు, పరిశ్రమలు నడుపుతున్న వారు తమ వ్యాపారాలను ఎలా ఏఐ ఎనేబుల్డ్ సర్వీసెస్గా మార్చుకోవాలో వివిధ రంగాల నిపుణులు తెలియజేశారు.
పటమట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, వీఎంసీ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి. లక్ష్మీశ శనివారం ఉదయం విజయవాడ గాంధీజీ మహిళా కళాశాల సమీపంలోని అన్న క్యాంటీన్ను ఆకస్మికంగా తనిఖీచేశారు. టోకెన్ కౌంటర్లో రూ.5 చెల్లించి క్యూలో నిలబడి, భోజనానికి వచ్చిన ప్రజలతో మాట్లాడారు. క్యాంటీన్లో వసతులు ఎలా ఉన్నాయి? ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. తాను కూడా ఆహార నాణ్యత పరీక్షించేందుకు భోజనం చేశారు. ఈ పర్యటనలో వీఎంసీ జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ సిబ్బంది పాల్గొన్నారు.


