క్రమబద్దకీకరణ
బీపీఎస్కు ఇవి ఇవ్వాలి
సరైన పత్రాలు సమర్పించాల్సిందే
పటమట(విజయవాడతూర్పు): నగరపాలక సంస్థలో క్రమబద్ధీకరణ ప్రక్రియ జాప్యమవుతోంది. అనుమతులు లేకుండా.. ప్లాన్లు మంజూరు కాకుండా .. అదనపు అంతస్తులు వేసిన భవనాల క్రమబద్ధీకరణకు ఏపీ బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్) 2025 విడుదల చేసింది. ఇది ఆగస్టు 31 2025 వరకు నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించేందుకు వర్తిస్తుంది. నగరపాలక సంస్థ పరిధిలో అధికారిక లెక్కల ప్రకారం 2,157 భవనాలు అనధికారికంగా నిర్మించినట్లు అధికారులు సర్వే చేశారు. వీటి క్రమబద్ధీకరణకు వీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం అంతగా ఆసక్తి చూపడంలేదని, క్షేత్రస్థాయి సిబ్బంది కూడా వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
మందకొడిగా బీపీఎస్, ఎల్ఆర్ఎస్
నగరపాలక సంస్థ పరిధిలో మూడు సర్కిళ్లవారీగా ఇప్పటి వరకు 2157 అనధికారిక భవనాలను గుర్తించారు. వీటితో ఈ ఆర్థిక సంవత్సరానికి వీఎంసీకి రూ. 60 కోట్లు ఆదాయం సమకూరుతుందని అధికారులు వార్షిక బడ్జెట్లో కూడా పొందుపరచారు. వచ్చిన దరఖాస్తుల్లో కేవలం 270 దరఖాస్తులు మాత్రమే పరిష్కరించారు. వీటిద్వారా రూ.5.84 కోట్లు మాత్రమే ఆదాయం సమకూరింది. ఇంకా 1,887 దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉంది. ఒకవైపు దీనిపై విస్తృత ప్రచారం కూడా జరగలేదు. మరోవైపు క్షేత్రస్థాయి అధికారులు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించకుండా వారిలాగిన్లోనే పెండింగ్లో పెట్టి భవన యజమానులతో బేరసారాలు చేసుకుంటున్నారని, అందుకే నత్తనడకన సాగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఒక్కో భవనానికి స్థలం, భవనం కొలతల మేరకు, అక్కడ ఉన్న స్థల ధరలను రూ.లక్ష నుంచి 3లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఎల్ఆర్ఎస్ పరిస్థితి కూడా ఇలాగే సాగుతోంది. నగరంలో ఇప్పటి వరకు 1,881 దరఖాస్తులు ఎల్ఆర్ఎస్కు రాగా కేవలం 172 మాత్రమే పరిష్కరించారు. వీటితో రూ.17.69 కోట్లు వచ్చాయి. ఇంకా 1709 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీటిని రెగ్యులరైజ్ చేస్తే కార్పొరేషన్కు రూ. 90 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. ఎల్ఆర్ఎస్ నవంబర్లో, బీపీఎస్ ప్రక్రియ డిసెంబర్లో మొదలయ్యాయి.
ఎల్ఆర్ఎస్కు
విజయవాడలోని లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) 2020 జూన్ 30, 2020 కి ముందు రిజిస్టర్ చేయబడిన అనధికార ప్లాట్లు/లేఅవుట్లను క్రమబద్ధీకరించడానికి ఈ పథకం వర్తిస్తుంది. ఏప్రిల్ 23 లోపు దరఖాస్తు చేయాలి. మున్సిపల్, గ్రామ పంచాయతీ ప్రాంతాల్లో అనధికార లేఅవుట్లలోని ప్లాట్లకు ఈ పథకం వర్తిస్తుంది. దరఖాస్తు దారులు యాజమాన్య ధ్రువీకరణ కోసం సేల్ డీడ్, లింక్ డాక్యుమెంట్లు, లే అవుట్ ప్లాన్, యు సైట్ ఫొటోలనుఆన్లైన్లో సమర్పిం చాలి. చార్జీలు, జరిమానాలు ప్లాట్ మార్కెట్ విలువ, పరిమాణంపై ఆధారపడి ఉంటాయి. హెచ్టీటీపీ://డీటీసీపీడాట్ఏపీడాట్జీవోవీడాట్ఇన్/ఎల్ఆర్ఎస్లో దరఖాస్తు చేయాలి
విజయవాడలో బీపీఎస్(బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం), ఎల్ఆర్ఎస్(ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం) అమలు నత్తనడకన సాగుతోంది. ఇప్పటి వరకు పది శాతం మాత్రమే క్రమబద్ధీకరణ జరిగింది. అధికారుల్లో వేగం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫ్లైళ్లు క్లియరెన్స్ కాకపోవడం.. నగరపాలక సంస్థ ఆదాయంపై ప్రభావం చూపేలా ఉంది.
బీపీఎస్కు మార్చి11వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలి. 1985 జనవరి 1వతేదీ నుంచి 2025 ఆగస్టు 31వ తేదీలోపు నిర్మించిన భవనాలకు హెచ్టీటీపీ://బీపీఎస్డాట్ఏపీడాట్జీవోవీడాట్ఇన్/బీపీఎస్/లాగిన్డాట్లో దరఖాస్తు చేయాలి ఆమోదించిన ప్లాన్, యాజ్ ఆన్ గ్రౌండ్ ప్లాన్, ఎలివేషన్, సెక్షన్, సైట్ ప్లాన్ ఉండాలి. గడువు దాటినా దరఖాస్తు చేసుకోనివారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
బీపీఎస్కు, ఎల్ఆర్ఎస్కు నగరంలో వీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం క్షేత్రస్థాయిలో గుర్తించింది. వాటిని క్రమబద్ధీకరించడానికి ఆయా స్థల, భవన యజమానులకు సరైన యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. చాలామంది దరఖాస్తు చేయకపోవటానికి కూడా కారణం అదే అవుతుంది. వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాం. నగరంలో విస్తృతమైన అవగాహన కల్పించేందుకు కూడా ప్రణాళికలు రూపొందించాం.
–సంజయ్ రత్నకుమార్, వీఎంసీ చీఫ్ సిటీప్లానర్


