నవ్విపోయిన నాణ్యత!
సర్కార్ పాఠశాలల్లో చిరిగిపోయిన బ్యాగ్లు, షూలతో అవస్థలు సగానికి పైగా మూలనపడ్డ బ్యాగులు సొంత డబ్బులతో కుట్టించుకొని నానా తంటాలు పడుతున్న విద్యార్థులు నాణ్యతలేని బ్యాగులిచ్చారంటూ మండిపడుతున్న తల్లిదండ్రులు
రెండు నెలల్లో చిరిగిపోయాయి..
అంతా ప్రచార ఆర్భాటమే..
వన్టౌన్(విజయవాడపశ్చిమ): చంద్రబాబు ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం సర్కార్ పాఠశాలల విద్యార్థులకు అందించిన బ్యాగులు ఇతర సామగ్రి మూణ్నాళ్ల ముచ్చటగా మారాయి. వాటి నాణ్యత దారుణంగా ఉండటంతో విద్యార్థులు నానాతంటాలు పడుతున్నారు. అంత చేస్తాం.. ఇంత ఇస్తామంటూ ఎన్నికల వేళ ఊదరగొట్టిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తరువాత విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారంటూ విద్యార్థి సంఘ నేతలు మండిపడుతున్నారు. ఇచ్చిన సామగ్రి మూడునాలుగు మాసాలకే చిరిగిపోయాయంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో 942 ప్రభుత్వ విద్యాసంస్థలు
ఎన్టీఆర్ జిల్లాలోని 20మండలాల్లో సుమారుగా 942 ప్రభుత్వ యాజమాన్య పరిధిల్లో కొనసాగే విద్యాసంస్థలు ఉన్నాయి. జిల్లా పరిషత్, ప్రభుత్వ, ఎయిడెడ్, మునిసిపల్ తదితర యాజమాన్యాల పేర్లతో అవి కొనసాగుతున్నాయి. ఆయా విద్యా సంస్థల్లో సుమారుగా లక్ష మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. వారికి 2025–2026 విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలతో పాటుగా బ్యాగ్, షూస్, యూనిఫామ్ తదితర వస్తువులతో కూడిన కిట్లను అందించారు. సాధారణంగా పాఠశాలలు తెరిచిన వెంటనే ఇవ్వాల్సిన వస్తువులను దాదాపుగా నెల రోజుల తేడాతో వాటిని విద్యార్థులకు అందించారు.
ఇచ్చిన నెలకే చిరిగిపోయాయి..
ప్రభుత్వం అందించిన బ్యాగులు, షూస్ విద్యార్థులకు అందిన నెల రోజులకే చిరిగిపోయాయంటూ విద్యార్థులు వాపోతున్నారు. ప్రధానంగా నాణ్యత లేని బ్యాగులు అందించటంతో చిరిగిపోయిన వాటిని కొంతమంది వాటిని కుట్టే వారికి అందించి డబ్బులిచ్చి కుట్టించుకున్నామని చెబుతున్నారు. మరికొంతమంది వారే సూదితో కుట్టుకొని అవస్థలు పడుతూ వినియోగిస్తున్నారు. కొంతమంది తమ బ్యాగులు ఎక్కడికక్కడ పీసులుగా ఊడిపోయి కుట్టడానికి సైతం కుదరకపోవటంతో వాటిని బయట పడేసి ఇతర బ్యాగులతో పాఠశాలలకు వస్తున్నారు. షూస్ పరిస్థితి సైతం అదే విధంగా ఉందని విద్యార్థులతో పాటుగా కొంతమంది ఉపాధ్యాయులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.
తల్లిదండ్రుల ఆగ్రహం..
చంద్రబాబు ప్రభుత్వం పాలనలో తమ పిల్లలకు బ్యాగులు, షూస్ ఇచ్చామనే పేరే తప్ప వాటిలో నాణ్యత లేదని పలువురు తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రభుత్వం అందించే వస్తువులు నాణ్యత లేకపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా విద్యార్థులు అందులోనూ చిన్నపిల్లలు వాడే వస్తువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం ఏమిటంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరిగిపోయిన బ్యాగుల్లో పుస్తకాలు తీసుకువెళ్లటానికి చిన్నారులు నానా తంటాలు పడుతున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విద్యా సంవత్సరం చంద్రబాబు ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు అందించిన వస్తువులు చాలా నాసిరకంగా ఉన్నాయి. బ్యాగ్తో పాటు బూట్లు కూడా రెండు నెలలకే చిరిగిపోయాయి. వాటిని పక్కన పెట్టేసి చెప్పులతోనే స్కూల్కి పంపుతున్నాం. పేద పిల్లల కోసం ఇస్తున్న వస్తువుల్లో నాణ్యత ఉండాలే తప్ప, ఇలా మూడునెల్లకే పాడైపోతే ఎలా? మళ్లీ మా ఖర్చులతో కొనక తప్పడం లేదు. ప్రభుత్వం నాణ్యమైన వస్తువులను ఇస్తే పేదలపై భారం తగ్గుతుంది.
– పేటేటి లావణ్య,
విద్యార్థి తల్లి, మచిలీపట్నం
ప్రభుత్వం పిల్లల భవిష్యత్తు కోసం ఇస్తున్నామంటూ ప్రచారం పెద్దగా చేస్తోంది. కానీ ఇచ్చిన బ్యాగులు నాణ్యత చాలా దారుణంగా ఉంది. కొన్ని పుస్తకాలను కూడా వాటిల్లో తీసుకెళ్లలేని పరిస్థితి. పిల్లలు చిరిగిన బ్యాగులను తలపై పెట్టుకుని మోసుకు వెళ్తున్నారు. తెగిపోయిన బూట్లను ఈడ్చుకుంటూ స్కూళ్లకు వెళ్తున్నారు. రెండు నెలలకే ఇలా పాడయితే పేదలు ఎలా కొనగలరు? ప్రభుత్వం పేదల పరిస్థితి తెలిసి కూడా కనీస నాణ్యతతో ఇవ్వాల్సింది పోయి దారుణమైన వస్తువులు విద్యార్థులకు అందించారు.
– కోటప్రోలు నాగు, సర్పంచ్,
చినగొన్నూరు, గుడ్లవల్లేరు మండలం
నవ్విపోయిన నాణ్యత!
నవ్విపోయిన నాణ్యత!
నవ్విపోయిన నాణ్యత!
నవ్విపోయిన నాణ్యత!


