
ఉద్యాన పంటలతో సుస్థిర ఆదాయం
ఎన్టీఆర్ జిల్లా కలెక్లర్ లక్ష్మీశ
నందిగామ రూరల్: రైతులు ఉద్యాన పంటలు సాగు చేయటం వల్ల అధిక, సుస్థిర ఆదాయాన్ని పొందవచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. మండలంలోని కేతవీరునిపాడు గ్రామంలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ముందుగా రైతులు పండిస్తున్న పంటలు.. ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు లాభసాటి వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకం వల్ల అదనపు ఆదాయాన్ని పొందవచ్చన్నారు. ముఖ్యంగా వివిధ రకాల పంటలను క్రమపద్ధతిలో పండించటం వల్ల నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని, తెగుళ్లు, కలుపు మొక్కల వంటి సమస్యలతో పాటు ఎరువుల అవసరమూ తగ్గుతుందని చెప్పారు. ఉపాధి హామీ పథకం అనుసంధానంతో ఉచితంగా పండ్లు, పూల మొక్కల సాగు చేపట్టాలని సూచించారు.
అగ్రిటెక్పై అవగాహన..
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి మంగళ, బుధవారాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. సాగు పరంగా రైతుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి శాస్త్రవేత్తలు, అధికారుల ద్వారా సూచనలు, సలహాలు అందిస్తామని తెలిపారు. పాల ఉత్పత్తిని పెంచి తద్వారా రైతులకు అదనపు ఆదాయం వచ్చే వీలుగా కేతవీరునిపాడు గ్రామంలో యానిమల్ హాస్టల్ ప్రారంభించే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఆర్డీవో బాలకృష్ణ, జిల్లా వ్యవసాయాధికారి విజయకుమారి, పశు సంవర్ధక శాఖాధికారి డాక్టర్ హనుమంతరావు, వ్యవసాయ శాఖ ఏడీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.