
దళారీ వ్యవస్థను సహించం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రైతుబజార్లలో దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తే సహించేది లేదని జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ హెచ్చరించారు. నగరంలోని జాయింట్ కలెక్టర్ చాంబర్లో గురువారం మార్కెటింగ్, రైతుబజార్ల ఎస్టేట్ అధికారులతో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ రైతు పండించిన పంటను నేరుగా వినియోగదారులకు విక్రయించడానికి ప్రభుత్వం రైతుబజార్లు ఏర్పాటు చేసిందన్నారు. విజయవాడ అర్బన్లో తొమ్మిది, రూరల్లో ఆరు రైతుబజార్లు ఉన్నాయని చెప్పారు. వీటి ద్వారా వినియోగదారులకు తక్కువ ధరకే కూరగాయలు, నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచామన్నారు. ఉదయం ఆరు గంటలకే అన్ని రైతుబజార్లలో ఎస్టేట్ అధికారులు విధుల్లో ఉండి ధరల పట్టికను సిద్ధంగా ఉంచాలన్నారు. రైతులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు కలిగి ఉండాలన్నారు. వినియోగదారులతో స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పారు. రైతు బజార్లలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయాలన్నారు. పరిసరాలను, మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ శానిటేషన్ను మెరుగుపరచాలని ఆదేశించారు. రైతుబజార్ల ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటామని, విధుల్లో అలసత్వం వహించినా, ఫిర్యాదులు వచ్చినా సహించబోమని ఎస్టేట్ అధికారులను హెచ్చరించారు. సమావేశంలో మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకుడు బి. రాజబాబు, రైతుబజార్ల ఎస్టేట్ అధికారులు పాల్గొన్నారు.
రైతుబజార్లలో నిర్ణయించిన ధరలకే విక్రయించాలి జాయింట్ కలెక్టర్ ఇలక్కియ