
ముగిసిన స్పెషల్ ‘కేటగిరీ’ సర్టిఫికెట్ల పరిశీలన
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఏపీ ఈఏపీ సెట్–2025 (ఎంపీసీ) పరీక్షలో ర్యాంకులు పొందిన స్పెషల్ కేటగిరీ ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలన బుధవారం సాయంత్రంతో ముగిసింది. నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ సెంటర్లో ఈ నెల 12వ తేదీ నుంచి ప్రక్రియ మొదలైంది. ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, సీఏపీ, విభిన్న ప్రతిభావంతులు, ఆంగ్లో ఇండియన్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ కేటగిరీ అభ్యర్థులు.. వారు పొందిన ర్యాంకుల ఆధారంగా తేదీలను కేటాయించి, సర్టిఫికెట్ల పరిశీలన చేశారు. సీఏపీ–28, విభిన్న ప్రతిభావంతులు–129, స్కౌట్స్ అండ్ గైడ్స్–61 మంది చొప్పున 218 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను బుధవారం పరిశీలించారు. జనరల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్లను ఆన్లైన్లో పరిశీలించామని హెల్ప్లైన్ సెంటర్ కో–ఆర్డినేటర్ ఎం.విజయసారథి చెప్పారు. ఈ నెల 18వ తేదీలోగా ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలన్నారు. 19వ తేదీన నమోదు చేసుకున్న వెబ్ఆప్షన్లలో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని, ఈ నెల 22వ తేదీ సాయంత్రం సీట్ అలాట్మెంట్ వివరాలను ఆన్లైన్లో విడుదల చేస్తారని తెలిపారు.
తిరుమలగిరి నుంచి
దుర్గమ్మకు సారె
తిరుమలగిరి(జగ్గయ్యపేట): స్థానిక వాల్మీకోద్భవ వేంకటేశ్వర స్వామి వారి తరఫున విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి ఆషాఢమాసం సందర్భంగా బుధవారం సారె సమర్పించారు. ఆలయ ఈవో సాంబశివరావు ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు, భక్తులు, సిబ్బంది అమ్మవారికి పూలు, పండ్లు, నూతన వస్త్రాలు, పసుపు, కుంకుమను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ భరద్వాజ్, ప్రదానార్చకుడు రామకృష్ణమాచార్యులు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
జిల్లాలో క్షయ నివారణ చర్యల పరిశీలన
లబ్బీపేట(విజయవాడతూర్పు): టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను బుధవారం కేంద్ర బృందం పరిశీలించింది. ఆ బృందంలోని సభ్యులు డాక్టర్ భావనీసింగ్ కుశ్వహా, టీబీ ఆఫీసర్ ఈ. దర్మారావు, గంగాధర్ దాస్లతో పాటు రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ రమేష్ పలు ప్రాంతాల్లో పర్యటించారు. జిల్లాలో జరుగుతున్న అవగాహన కార్యక్రమాలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వ్యాధి సోకిన వారికి ఇచ్చే మందులు, వ్యాధి రాకుండా తీసుకుంటున్న ముందస్తు చర్యలు, జాగ్రత్తలపై నిర్వహిస్తున్న కార్యక్రమాలపై ఆరా తీశారు. అందులో భాగంగా ఏపీఐఐసీ కాలనీలోని యూపీహెచ్సీ, ప్రభుత్వాస్పత్రిలోని టీబీ ల్యాబ్, అక్కడ నిర్వహిస్తున్న పరీక్షలను పరిశీలించారు. అనంతరం టీవీ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాసవ్య మహిళా మండలిని సందర్శించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని, జిల్లా టీబీ అధికారి డాక్టర్ బాలూనాయక్ తదితరులు పాల్గొన్నారు.
రైతులకు బీమాపై
అవగాహన కల్పించండి
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా రైతులందరూ బీమా చెల్లించేలా అవగాహన కల్పించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు అవగాహన కల్పించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని ఆయన చాంబర్ నుంచి క్షేత్రస్థాయి వ్యవసాయాధికారులు, బ్యాంకర్లతో జూమ్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉన్నందున రైతులందరూ బీమా ప్రీమియం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కేవలం జిల్లాలో 46 మంది రైతులు మాత్రమే బీమా చెల్లించటం ఆశ్చర్యకరంగా ఉందని, బీమా ద్వారా కలిగే ప్రయోజనాలను రైతులకు అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ ప్రీమియం కట్టేలా చూడాలన్నారు. జిల్లా వ్యవసాయాధికారి మనోహరరావు, ఏడీ మణిధర్, ఎల్డీఎం రవీంద్రరెడ్డి, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

ముగిసిన స్పెషల్ ‘కేటగిరీ’ సర్టిఫికెట్ల పరిశీలన

ముగిసిన స్పెషల్ ‘కేటగిరీ’ సర్టిఫికెట్ల పరిశీలన