పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం
ఆత్కూరు(గన్నవరం): పరీక్షలలో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉంగుటూరు మండలం ఆత్కూరులో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన మొగల్ వహీదాబి(19) పాలిటెక్నిక్ డిప్లొమా చదివింది. అయితే సోమవారం విడుదలైన డిప్లొమా పరీక్ష ఫలితాల్లో వహీదాబి నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది.
ఈ నేపథ్యంలో మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన ఆమె తమ్ముడు ఉరి బిగించుకుని వేలాడుతున్న వహీదాబిని బంధువుల సాయంతో కిందకు దించి గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. వహీదాబి తండ్రి ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, తల్లి, సోదరుడితో కలిసి ఉంటుంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
కంచికచర్ల: రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందిన సంఘటన మంగళవారం పట్టణంలో జరిగింది. ఎస్ఐ బి. రాజు కథనం మేరకు కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామానికి చెందిన షేక్ సమీర్ పాషా(20) విజయవాడ సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. పరీక్ష రాసి బైక్పై ఇంటికి వస్తున్నాడు. కంచికచర్ల శ్రీ శివసాయి క్షేత్రం సమీపంలోకి రాగానే నేషనల్ హైవేపై రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్ను వెనుక నుంచి వచ్చి బైక్తో ఢీకొట్టాడు. ఈ ఘటనలో సమీర్పాష రోడ్డుపై పడటంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. సమీర్పాష తండ్రి జమాలి నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. అతని అక్కకు మూడేళ్ల క్రితం వివాహమైంది.
ఇసుక లారీలు సీజ్
తిరువూరు: రాష్ట్రం నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను ఆ రాష్ట్ర పోలీసులు పెనుబల్లి మండలం మర్లకుంట వద్ద మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. గత రెండు రోజులుగా తెలంగాణ టాస్క్ఫోర్స్ పోలీసులు సరిహద్దు గ్రామాల్లో నిఘా పెట్టి తిరువూరు నుంచి పెనుబల్లి, వేంసూరు, కల్లూరు మండలాలకు ఇసుక తరలకుండా కట్టడి చేశారు. తిరువూరు శివారు తోకపల్లి మీదుగా మర్లకుంట తదితర గ్రామాలకు నిత్యం ఇసుక లారీలు వెళుతున్నట్లు స్థానికులు ఇచ్చిన సమాచారంతో రెండు టిప్పర్లను తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరువూరు పోలీసులు సైతం మరో టిప్పరును ఇసుక తరలిస్తుండగా మల్లేల రోడ్డులో పట్టుకున్నారు.
భారీగా గంజాయి పట్టివేత
కృష్ణలంక(విజయవాడతూర్పు): గుట్టుచప్పుడు కాకుండా ఓ వ్యాన్లో తరలిస్తున్న గంజాయిని కృష్ణలంక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సేకరించిన వివరాల మేరకు.. మంగళవారం ఉదయం టాటా వ్యాన్లో గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఒక టాటా వ్యాన్ను ఆపి తనిఖీ చేయగా అందులో పెద్ద మొత్తంలో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. వ్యాన్ను స్వాధీనం చేసుకుని డ్రైవర్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. సీజ్ చేసిన గంజాయి దాదాపు 100 కేజీల వరకూ ఉన్నట్లు తెలుస్తోంది.