
షరా‘మామూలే’!
పెనమలూరు: యనమలకుదురు ఇసుక క్వారీలో మామూళ్ల వివాదం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. టీడీపీ నేతలు హుకుంతో రెవెన్యూ అధికారులు క్వారీ గేటుకు తాళం వేశారు. వివరాల్లోకి వెళితే.. యనమలకుదురు ఇసుక క్వారీని 15ఏళ్ల క్రితం రివర్ కన్జర్వేటర్ ఆదేశాలతో నదిలో ఇసుక తవ్వకాలు నిషేధించారు. అప్పటి నుంచి ఇసుక క్వారీలో తవ్వకాలు జరగటం లేదు. మధ్యలో కొందరు ఇసుక మాఫియా తవ్వకాలు చేయటంతో గత ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియాపై పోలీసులు సస్పెక్ట్ షీట్లు తెరిచింది.
కూటమి పాలనలో మళ్లీ మొదలు..
కాగా కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నిషేధ ఇసుక క్వారీలో అక్రమం తవ్వకాలు మొదలుపెట్టారు. చట్టాన్ని, నిబంధనలు గాలికి వదిలేశారు. అధికారులు ఇదంతా చూస్తూనే ఉన్నా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. నిషేధ ఇసుక క్వారీ పరిస్థితి ప్రమాదంగా మారింది. తవ్వకాలతో నదిలో భారీ గుంతలు ఏర్పడి నదీ పరీవాహక ప్రాంతం ప్రమాదకరంగా మారింది.
గొడవేంటంటే..
ఇసుక ట్రాక్టర్కు రూ. 500 మామూలు ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్ చేయటంతో సోమవారం రాత్రి క్వారీ వద్ద గొడవ తలెత్తింది. దీనికి ట్రాక్టర్లలో ఇసుక తరలించేవారు అభ్యంతరం తెలిపారు. దీంతో ఉద్రిక్త పరిస్థితుల ఏర్పడ్డాయి. పోలీసులు, సొసైటీ, రెవెన్యూ సిబ్బందికి ఇప్పటికే మామూళ్లు ఇస్తున్నామని, ఇప్పుడు టీడీపీ నేతలకు కూడా మామూళ్లు ఇస్తే తమకు ఏమి మిగులుతుందని ట్రాక్టర్ యజమానులు అడ్డం తిరిగారు. దీంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసి ఇసుక క్వారీ గేటుకు పోలీసుల అండదండలతో రెవెన్యూ అధికారుల చేత మంగళవారం తాళం వేయించారు. అధికారులు కళ్ల ఎదుటే నిషేధ ఇసుక క్వారీలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నా.. మామూళ్ల విషయంలో గొడవ జరుగుతున్నా.. ఆ దిశగా చర్యలు తీసుకోకపోగా.. కేవలం టీడీపీ నాయకుల ఆదేశాల మేరకు క్వారీకి తాళాలు వేయడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. అంతేకాక ఈ మామూళ్ల వ్యవహారం తెరపైకి రావటంతో ఈ దందాలో ఎవరెవరి పాత్ర ఉందనేది స్పష్టమయింది. చట్టం తనపని తాను చేసుకు పోతుందని కూటమి నేతలు తరచూ ఊకదంపుడు ప్రకటనలు చేస్తుంటే మరి యనమలకుదురులో చట్టం ఏమయిందో ఆ నేతలే చెప్పాల్సి ఉంది.
వాటా ఇవ్వడం లేదన్న నెపంతో
టీడీపీ నేతల రాద్ధాంతం
యనమలకుదురు క్వారీ గేటుకు తాళం