భవానీపురం(విజయవాడపశ్చిమ): వార్డు సచివాలయ ఉద్యోగులను ఒక వార్డు నుంచి మరో వార్డుకు బదిలీ చేయవచ్చని ప్రభుత్వం జీఓ జారీ (జీఓ ఎంఎస్ నంబర్ 6) చేయడం పట్ల ఏపీ గ్రామ/వార్డ్ సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల అర్లయ్య హర్షం వ్యక్తం చేశారు. అదే మాదిరిగా గ్రామ సచివాలయ ఉద్యోగులు కూడా సొంత మండలాల్లో విధులు నిర్వర్తించే వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు ఆయన రాష్ట్ర కమిటీ సభ్యుడు బగ్గా జగదీష్తో కలిసి మంగళవారం వెలగపూడిలోని సచివాలయంలో మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామిని కలిసి వినతి పత్రం అందజేశారు. హేతుబద్దీకరణ ప్రక్రియ వల్ల సచివాలయ ఉద్యోగులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారని, మిగులు ఉద్యోగుల భవితవ్యంపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తాము విన్నవించిన అంశాలపై మంత్రి బాల వీరాంజనేయ స్వామి సానుకూలంగా స్పందిస్తూ సొంత మండలాల్లో పని చేసే విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారని అర్లయ్య పేర్కొన్నారు.
నైపుణ్యాభివృద్ధితో ఆర్థిక వృద్ధి సాధ్యం
దిశ కమిటీ సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): ప్రణాళికాబద్ధ ఆర్థిక పురోగతికి ముఖ్యంగా యువతలో నైపుణ్యాభివృద్ధి కీలకమని.. ప్రతి మండలంలో స్థానిక పారిశ్రామిక అవసరాలు, అభివృద్ధికి దోహదం చేసే వనరులను దృష్టిలో ఉంచుకొని నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరముందని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. మంగళవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది.
కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, జగ్గయ్యపేట, తిరువూరు ఎమ్మెల్యేలు శ్రీరాం రాజగోపాల్, కొలికపూడి శ్రీనివాసరావు హాజరైన ఈ సమావేశంలో వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు పురోగతి, భవిష్యత్తు కార్యాచరణ, సమస్యల గుర్తింపు, పరిష్కారానికి చర్యలపై చర్చించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ పీ4 విధానం అమల్లో జిల్లాను ముందు నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఒక కుటుంబం–ఒక పారిశ్రామికవేత్త లక్ష్యాలను చేరుకునేందుకు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జెడ్పీ సీఈవో కె.కన్నమనాయుడు, సీపీవో వై.శ్రీలత, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, డీఈవో డీఎంఎఫ్ విజయకుమారి, డ్వామా పీడీ ఎ.రాము, డీఎంహెచ్వో డాక్టర్ ఎం.సుహాసిని, హౌసింగ్ పీడీ పి.రజనీకుమారి, డీఈవో యూవీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

నైపుణ్యాభివృద్ధితో ఆర్థిక వృద్ధి సాధ్యం