
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
గుడివాడటౌన్: ప్రతి రోజు యోగాసనాలు చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో యోగాంధ్ర–2025 కార్యక్రమంలో భాగంగా సామూహిక యోగా కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు, పట్టణ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని యోగాసనాలు చేశారు. యోగాకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్రమోదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రారంభించారన్నారు. ఎంతో విశిష్ఠత కలిగిన యోగాపై నేటి యువతకు అవగాహన కల్పించాలని చెప్పా. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం నాటికి ప్రతి ఒక్కరికీ యోగాపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఆర్వో చంద్రశేఖర్రావు, గుడివాడ ఆర్డీఓ జి.బాల సుబ్రహ్మణ్యం, డీఎస్పీ ధీరజ్ వినీల్, స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి కె.రంగప్రసాద్, మున్సిపల్ మాజీ చైర్మన్ లంకదాసరి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.