
బాస్కెట్బాల్ ఉమ్మడి జిల్లా జట్ల ఎంపిక
విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి అండర్–23 బాస్కెట్ బాల్ పోటీలకు ప్రాతినిధ్యం వహించే ఉమ్మడి కృష్ణాజిల్లా సీ్త్ర, పురుషుల జట్లను నూజివీడులోని వీటీహెచ్ మైదానంలో సోమవారం ఎంపిక చేసినట్లు కృష్ణాజిల్లా బాస్కెట్ బాల్ సంఘం అధ్యక్షుడు జి.సుభాష్చంద్రబోస్ తెలిపారు. పురుషుల జట్టుకు జి.నాగబాబు, ఎస్కే యాసిన్, ఎ.తేజ, బి.సంజయ్శ్రీనివాస్, మహిళల జట్టుకు బి.ప్రభుదీపిక, షేక్ అస్రా, బి.ప్రణవి, బి.కుసుమ ఎంపికయ్యారన్నారు. ఈ నెల 4, 5 తేదీల్లో చిత్తూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ జట్లు పాల్గొంటాయని చెప్పారు.
‘ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తారా ?’
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటుకు అప్పగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(పీడీఎస్ఓ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.సురేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందరికీ ఉచిత వైద్యం, వైద్య విద్య అంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మరచి, ప్రభుత్వం వైద్య రంగాన్ని ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తూ కార్పొరేట్ దోపిడీకి తలుపులు తెరిచిందన్నారు. ఈ విధానాలు పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మధ్యతరగతి ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను, వైద్య విద్యను అందని ద్రాక్షగా మారుస్తున్నాయని, ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం 17 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించి, ఐదు కళాశాలల్లో అడ్మిషన్లు కూడా జరిపిందన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటుకు అప్పగించే కుట్ర చేస్తోందని తెలిపారు. అంతేకాకుండా రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను, భవనాలను ప్రైవేటుకు అప్పనంగా అప్పగించే ప్రయత్నం జరుగుతుందని, దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో వంద శాతం సీట్లు కన్వీనర్ కోటాలోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఇన్నొవేషన్ హబ్ పనులను త్వరగా పూర్తి చేయండి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
రామవరప్పాడు: స్టార్టప్లు, ఆవిష్కరణలకు రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్)తో సరికొత్త ఊపు రానుందని, ఈ హబ్తో పారిశ్రామిక రంగం రూపురేఖలు సమూలంగా మారనున్నాయని ఇందుకు సంబంధించి స్పోక్ కార్యాలయ పనులను త్వరితగతిన పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. టాటా ఇన్నొవేషన్ హబ్– స్పొక్ కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన కార్యాలయం, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఎనికేపాడులో భవనాన్ని సోమవారం కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్టీఐహెచ్ కార్యకలాపాలను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. నాలుగైదు రోజుల్లో నాలుగో అంతస్తులోని ఒక బ్లాకు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ హబ్కు అనుసంధానంగా విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపూర్లో ప్రాంతీయ స్పోక్స్ కేంద్రాలను అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కావూరి చైతన్య, తహసీల్దారు బి. సుగుణ, ఆర్ అండ్బీ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.

బాస్కెట్బాల్ ఉమ్మడి జిల్లా జట్ల ఎంపిక