
ప్రజల కోసమే పోలీస్ వ్యవస్థ
మీ కోసంలో కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు
కోనేరుసెంటర్: ప్రజల కోసమే పోలీస్ వ్యవస్థ పని చేస్తోందని, ప్రజలకు ఎటువంటి అన్యాయం జరిగినా పోలీసులను ఆశ్రయించి న్యాయం పొందవచ్చని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని స్పందన హాలులో సోమవారం జరిగిన మీ కోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. బాధితుల సమస్యలను సామరస్యంగా ఆలకించిన ఆయన పలు అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించారు. మరి కొన్ని అర్జీలను సంబంధిత అధికారులకు సిఫార్సు చేశారు.
38 అర్జీలు అందజేత..
అనంతరం ఆయన మాట్లాడుతూ మీ కోసంకు వచ్చే బాధితులకు పోలీసులు అండగా ఉంటారన్నారు. సుదూర ప్రాంతాల నుంచి జిల్లా పోలీసు కార్యాలయానికి రాలేని బాధితులు సమీపంలోని డీఎస్పీ, సీఐ కార్యాలయాలతో పాటు పోలీస్స్టేషన్లలోనూ తమ సమస్యలను వివరించి, న్యాయం పొందవచ్చని చెప్పారు. అలాగే ఫిర్యాదుదారులతో అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా మసలుకోవాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి ఆరోపణలకు అవకాశం లేకుండా చూసుకోవాలన్నారు. తన దృష్టికి అవినీతి ఆరోపణలు వస్తే తీసుకునే చర్యలు కఠినంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. అవనిగడ్డకు చెందిన ఓ వివాహిత వివాహ సమయంలో తల్లిదండ్రులు తనకు కొంత వ్యవసాయ భూమిని పసుపు కుంకుమ కింద రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వగా అన్నదమ్ములు ఇప్పుడు ఆ భూమి తమదంటూ అడ్డు పడుతున్నారంటూ వాపోయింది. అదేమని అడిగితే తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారంటూ వాపోయింది. న్యాయం చేయాలని కోరింది. అలాగే మచిలీపట్నంకు చెందిన మరో వ్యక్తి తన పొలం సరిహద్దుదారుడు తరుచూ తనతో గొడవలు పడుతూ మానసికంగా హింసిస్తున్నాడని, చెప్పలేని పదజాలంతో దూషిస్తూ దౌర్జన్యానికి దిగుతున్నాడని అతనిపై చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాని కోరాడు. మొత్తం 38 అర్జీలు మీ కోసంలో అందాయి.