
దుర్గాఘాట్లో అవభృదోత్సవం నిర్వహిస్తున్న ఆలయ అర్చకులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న మహా శివరాత్రి ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఉదయం 9 గంటలకు మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమంతో ఉత్సవాలు పరిసమాప్తమయ్యాయి. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు యజ్ఞనారాయణ శర్మ పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో రామారావు దంపతులు, ఈఈ ఎల్.రమాదేవి పాల్గొన్నారు. అనంతరం యాగశాలలో ధాన్యకోట్నోత్సవం నిర్వహించగా, ఆలయ చైర్మన్ రాంబాబు, ఈవో రామారావు దంపతులు పాల్గొన్నారు. అనంతరం వసంతోత్సవాన్ని నిర్వహించగా, ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది ఒకరిపై మరొకరు గులామ్లు చల్లుకుంటూ వేడుకను ఉత్సాహంగా నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను పల్లకీపై ఊరేగింపుగా దుర్గాఘాట్కు తీసుకెళ్లారు.
దుర్గాఘాట్లో అవభృదోత్సవం
దుర్గాఘాట్లో పవిత్ర కృష్ణానదిలో గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వార్లకు అవభృదోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ వైదిక కమిటీ పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆది దంపతుల ఉత్సవ మూర్తులకు మంగళస్నానాలను జరిపించారు. అనంతరం ఊరేగింపుగా తిరిగి ఆలయానికి చేరుకున్నారు.
నేడు ద్వాదశ ప్రదక్షిణలు..
మహా శివరాత్రిని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం ద్వాదశ ప్రదక్షిణలు నిర్వహిస్తున్నట్లు ఆలయ వైదిక కమిటీ పేర్కొంది. సోమవారం సాయంత్రం స్వామి వారికి పంచహారతుల సేవ అనంతరం ద్వాదశ ప్రదక్షిణలు, అనంతరం పవళింపు సేవ, శయనోత్సవాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
పూర్ణాహుతితో ముగిసిన మహాశివరాత్రి ఉత్సవాలు

ధాన్యకోట్నోత్సవం నిర్వహిస్తున్న చైర్మన్ రాంబాబు, ఈవో రామారావు