నీటి ఎద్దడి లేకుండా చర్యలు
తిర్యాణి: వేసవిని దృష్టిలో ఉంచుకుని మండలంలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపడతామని ఆర్డబ్ల్యూఎస్ డీఈ గడ్డి నరేశ్ అన్నారు. మండలంలోని గుండాల గ్రామాన్ని శుక్రవారం సందర్శించారు. స్థానిక తాగునీటి బావిని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అవసరమైన చోట నూతన బోర్వెల్ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. ఆయన వెంట మిషన్ భగీరథ ఏఈ కృష్ణతేజ, ఎంపీవో ప్రశాంత్, పంచాయతీ కార్యదర్శి రాధాకృష్ణ తదితరులు ఉన్నారు.


