
గిరి‘జనులకు’ రైలు కూత!
● మంచిర్యాల–ఉట్నూరు–ఆదిలాబాద్కు ముందడుగు ● నిజామాబాద్–నిర్మల్, పటాన్చెరు– ఆదిలాబాద్ దాక ● కొత్త లైన్లకు ఇంజనీరింగ్, ట్రాఫిక్, ఫిజిబిలిటీ సర్వేలకు ప్రతిపాదనలు ● పింక్బుక్ 2025– 26లో నిధులు అంచనా వేసిన రైల్వే శాఖ ● పట్టాలెక్కితే ఏజెన్సీ ప్రాంత వాసులకు రైలు యోగం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గిరిజన ప్రాంతాల్లో కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుకు ముందడుగు పడింది. తొలిసారిగా ఉమ్మడి జిల్లా గిరిజన, అడవుల వెంట రైలు మార్గాల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందుతోంది. ఈ మేరకు 2025–26 ఆర్థిక సంవత్సర రైల్వే బడ్జెట్ కేటాయింపులు తెలిపే కీలక పింక్బుక్లో వెల్లడించింది. గత ఫిబ్రవరిలోనే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ తాజాగా రైల్వే శాఖ ఈ బుక్లో ఉమ్మడి జిల్లాకు పలు కొత్త మార్గాలు, ట్రాఫిక్ సర్వేల కోసం నిధుల ప్రతిపాదనలు ఉన్నాయి. భవిష్యత్లో కాజిపేట–బల్లార్షా 234కి.మీ. నాలుగో లైన్ సర్వేకు రూ.4.68కోట్లు, వన్యప్రాణులకు ప్రాణనష్టం జరగకండా బల్లర్షా, ఆసిఫాబాద్ రోడ్ వరకు రైల్వే పట్టాల ఫెన్సింగ్కు నిధులు ప్రతిపాదించారు.
మంచిర్యాల టు ఆదిలాబాద్
వయా ఉట్నూరు
మంచిర్యాల నుంచి వయా ఉట్నూరు ఆదిలాబాద్ దాక ప్రతిపాదిత కొత్త మార్గం 186కి.మీ. నిడివి. ఇందుకు రూ.వంద కోట్లు అంచనా ప్రతిపాదించారు. ఈ లైను ఏర్పాటు కోసం భూమి, ట్రాఫిక్, ఫిజిబిలిటీ సర్వేలకు ఈ నిధులు వెచ్చించనున్నారు. కొత్తగా నిజామాబాద్–నిర్మల్–ఆదిలాబాద్ మధ్య మార్గం 125కి.మీ. కోసం ఇంజనీరింగ్, ట్రాఫిక్ సర్వే కోసం రూ.31లక్షలు, మరో కొత్త మార్గమైన పటాన్చెరు(నాగలపల్లి) వయా బోధన్ ఆర్మూర్ మీదుగా ఆదిలాబాద్ వరకు ఫైనల్ లొకేషన్ సర్వే 317కి.మీ కోసం రూ.7.92కోట్లు, ముత్కేడ్–ఆదిలాబాద్–పింపల్కుటి 183కి.మీ ఫైనల్ లోకేషన్ సర్వే కోసం రూ.3.66కోట్లు, ఆదిలాబాద్ –గడ్చాందూర్ 70కి.మీ సర్వే కోసం రూ.1.75కోట్లు, యావత్మాల్–ఆదిలాబాద్– వయా గంటిజి, పందర్కావందన్, చానఖా వరకు 100కి.మీ సర్వే కోసం రూ.25లక్షలు, సికింద్రాబాద్–ముత్కేడ్– ఆదిలా బాద్ 420కి.మీ. ఇంజనీరింగ్, ట్రాఫిక్ ప్రాథమిక డబ్లింగ్ సర్వేకు రూ.1.64కోట్లు ప్రతిపాదించారు.
ఆర్వోబీలు, స్టేషన్ల ఆధునీకరణ
ఆర్వోబీలు, వంతెనలకు ఆర్ఆర్ఎస్కే(రాష్ట్రీయ రేల్ సంరక్ష కోశ్), ఆర్ఎస్ నిధులు(రైల్వే సేఫ్టీ ఫండ్) కేటాయిస్తుంది. ఆదిలాబాద్ యార్డు–రోడ్ ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) లెవల్ క్రాసింగ్కు రూ.5.69 కోట్లు, ముత్కేడ్ ఆదిలాబాద్ పింపల్కుట్టి 68కి.మీ. రూ.4.71కోట్లు, ముత్కేడ్–ఆదిలాబాద్ 8.16కి.మీ. రూ.1.04కోట్లు, ఆర్ఆర్ఎస్కే రూ.1.93కోట్లు, ఆర్ఎస్ఎఫ్ రూ.9.73కోట్లు, ముత్కేడ్–ఆదిలాబాద్ ఘాట్ సెక్షన్లో ఆర్ఆర్ఎస్కే నుంచి రూ. 6.40కోట్లు, ఆదిలాబాద్ పిట్ లైన్ నిర్మాణం కోసం మూలధన నిధులు రూ.22.28కోట్లు, మంచిర్యాల–పెద్దంపేట మధ్య మూడో లైనుకు 4.37కి.మీ, మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేచ్నీ, రేపల్లెవాడ మధ్య రోడ్ కొత్తగా అండర్ బ్రిడ్జికి రూ.7.64కోట్లు, ఆదిలాబాద్ రైల్వేస్టేషన్లో భవనాలు, మరుగుదొడ్లు, విస్తరణ అభివృద్ధి కోసం రూ.4.44కోట్లు, ‘అమృత్’ స్కీం కింద ఆదిలాబాద్ స్టేషన్లో ఎఫ్వోబీ(ఫుట్ ఓవర్ బ్రిడ్జి) నిర్మాణం, దివ్యాంగుల ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లు, ఇతర ఏర్పాట్లకు ఎంపిక చేశారు. స్టేషన్లో లెస్ ట్రాక్, క్విక్ వాటరింగ్ కోసం రూ.14.95కోట్లు, ప్లాట్ ఫాంలపైన కవర్ నిర్మించేందుకు రూ.4.61కోట్లు ప్రతిపాదించారు. మంచిర్యాలకు అమృత్ స్కీం కింద నిధులు ప్రతిపాదించారు.
కార్యరూపం దాల్చితేనే..
నిధుల ప్రతిపాదనలతో సరిపెట్టకుండా ఆ మేరకు మంజూరు చేసి కార్యరూపం దాల్చితేనే కొత్త మార్గాల్లో రైలు ప్రయాణ యోగం కలుగనుంది. కొన్నేళ్లుగా రైల్వేలో ఫైనల్ లొకేషన్ సర్వే జరిగిన పనులు సైతం ఇప్పటికీ పట్టాలెక్కడం లేదు. తాజా ప్రతిపాదిత రైలు మార్గాలు అటవీ, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలతోపాటు అనేక గిరిజన ప్రాంతాల నుంచి వెళ్లనుంది. భూసేకరణ, అటవీ అనుమతులు, పరిహారం రూ.వందల కోట్లలోనే ఉండనుంది. కాగితాలపైనే సరిపెడితే మారుమూల ప్రాంతాలకు రైలు కూత అందని ద్రాక్షగానే మారనుంది.