● చదువులో సత్తా చాటుతున్న
ఆటోడ్రైవర్ కుమార్తెలు
తిరుమలాయపాలెం: మండలంలోని జల్లెపల్లికి చెందిన ఆటోడ్రైవర్ గాదరి వెంకన్న – సుమలతల కుమార్తెలు హర్షిణి, హాసిని చదువులో సత్తా చాటుతున్నారు. ఆర్థిక పరిస్థితులను లెక్క చేయకుండా పిల్లలిద్దరినీ చదివించేందుకు వెంకన్న మరింత కష్టపడ్డారు. ఈమేరకు ఖమ్మంలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ చదువుతున్న పెద్దకుమార్తె హర్షిణి ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఎంపీసిలో 995 మార్కులతో జిల్లా టాపర్గా నిలిచింది. ఇక చిన్న కుమార్తె హాసిని గౌలిదొడ్డి గురుకులంలో పదో తరగతి పూర్తిచేసి తాజాగా 581 మార్కులతో గురుకులంలో రెండో స్థానం సాధించడం విశేషం. ఈ సందర్భంగా హైదరాబాద్లో గురువారం హాసినిని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ సన్మానించినారు.
కలెక్టర్ను కలిసిన టీజీవోస్ నాయకులు
ఖమ్మం సహకారనగర్: కలెక్టర్ దివాకర టీఎస్ను తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవోస్) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొంగర వెంకటేశ్వరరావు, మోదుగు వేలాద్రి ఆధ్వర్యాన నాయకులు కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్కు వారు శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు కొండపల్లి శేషుప్రసాద్, డాక్టర్ పి.విజయ్కుమార్, కనపర్తి వెంకటేశ్వరరావు, బి.హరీష్, డి.బాలాజీ, తాజుద్దీన్, ఎం.సతీష్, బి.శారద, నారి విజయలక్ష్మి, బి.కిషోర్బాబు, శ్రీకాంత్, పి.రామయ్య, పవన్కుమార్, వేణుమాధవ్, రాజశేఖర్గౌడ్, శ్రీనివాసరావు, చందన్కుమార్, రాంబాబు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం
ఖమ్మంమయూరిసెంటర్: ప్రజల నుంచి అందిన సమస్యలు, దరఖాస్తుల పరిష్కారానికి కృషి చేస్తామని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలోని కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వినతులు స్వీకరించాక సత్యనారాయణ, నాగేశ్వరరావు మాట్లాడుతూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ ఆదేశాలతో ప్రజాదర్బార్ నిర్వహించామని తెలిపారు. నాయకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, గజ్జెల్లి వెంకన్న, కొత్తా సీతారాములు, దొబ్బల సౌజన్య, వేజండ్ల సాయికుమార్, పుచ్చకాయల వీరభద్రం, బొడ్డు బొందయ్య తదితరులు పాల్గొన్నారు.
‘చెల్లింపులు పూర్తికాలేదు’
ఖమ్మం సహకారనగర్: గత ఏడాది అక్టోబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు సమర్పించిన జీపీఎఫ్ బిల్లుల చెల్లింపులు పూర్తికాకున్నా, పూర్తయినట్లు ప్రభుత్వం చేస్తున్న ప్రచారం సరికాదని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం(ఎస్జీపీఏటీ) బాధ్యులు పేర్కొన్నారు. ఈ విషయమై జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పరిశ పుల్లయ్య, రాయల రవికుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు.


