చింతకాని/కొణిజర్ల: చింతకాని మండలం సీతంపేటలో కౌలు రైతు కప్పల పాండుకు చెందిన మూడెకరాల మొక్కజొన్న పంట సోమవారం అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. మూడెకరాల్లో సాగు చేసిన పంటకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. దీంతో అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వచ్చేసరికి రూ.2లక్షల విలువైన పంట కాలిపోయింది. ఈమేరకు స్థానికులతో కలిసి సిబ్బంది చుట్టుపక్కల పంటలకు అంటుకోకుండా మంటలు ఆర్పివేశారు. ఇక కొణిజర్లలో కొమ్మినేని సుధాకర్, సామినేని అనంతరాములు, బొడ్డు రాములు 70క్వింటాళ్ల మొక్కజొన్నలను కల్లాల్లో ఆరబోశారు. కాగా, సమీపంలోని పలువురి చేన్లలో మిగిలి ఉన్న దంటుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించడంతో మంటలు ఎగిసిపడి సమీపంలోని మొక్కజొన్న చేలకు వ్యాపించడమే కాక ముగ్గురు రైతులు కల్లాల్లో ఆరబోసిన మక్కలు సైతం కాలిపోయాయి. దీంతో రైతులు అప్రమత్తమై జేసీబీలతో మట్టి కట్టలు పోయించడంతో మంటలు విస్తరించలేదు. ఇంతలోనే వైరా నుంచి అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని ఆర్పివేశారు. కాగా, ఈ ఘటనలో రైతులు పొలాలకు నీరు అందించేందుకు ఏర్పాటుచేసిన పైపులు సైతం కాలిపోయాయి.
సీతంపేటలో ప్రమాదం, కొణిజర్లలో అనుమానం


