ఖమ్మంమయూరిసెంటర్: గుడిసెలు వేసుకుని జీవిస్తున్న పేదలను ఖాళీ చేయించి ఆ భూములను కబ్జా చేసిన చరిత్ర పువ్వాడ అజయ్కుమార్కు ఉందని కాంగ్రెస్ జిల్లా, నగర అధ్యక్షులు నూతి సత్యనారాయణగౌడ్, నాగండ్ల దీపక్ చౌదరి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ఆరోపించారు. ఖమ్మంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మెడికల్ కాలేజీ పేరుతో భూములను ఆక్రమిస్తే గతంలో అధికారులు కూల్చివేశారని గుర్తుచేశారు. అదే అజయ్కుమార్ ఇప్పుడు మంత్రులు భట్టి, తుమ్మల, పొంగులేటిపై విమర్శలు చేయడం గర్హనీయమని పేర్కొన్నారు. కాగా, ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు తెలిపారు. కార్మికులెవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. ఇక రైతుల విషయంలో బీఆర్ఎస్ నాయకులది మొసలి కన్నీరు అని విమర్శించారు. ఇప్పటికే జిల్లాలో వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, పుచ్చకాయల వీరభద్రం, దొబ్బల సౌజన్య, యర్రం బాలగంగాధర్ తిలక్, బాణాల లక్ష్మణ్, పాలకుర్తి నాగేశ్వరరావు, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, కల్వకుంట్ల గోపాల్, ఏలూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


