ఖమ్మంమయూరిసెంటర్: పదవుల్లో నియమితులైన నాయకులు క్రమశిక్షణతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్ సూచించారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో గురువారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. తొలుత ఇటీవల మరణించిన పీసీసీ సభ్యుడు మహమ్మద్ జావిద్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ముజాహిద్ హుస్సేన్ సతీమణి గౌసియా హుస్సేని, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావుకు సంతాపం ప్రకటించారు. అనంతరం సత్యనారాయణ మాట్లాడుతూ.. పదవుల్లో ఉన్న వారు ప్రజల సమస్యలు తెలుసుకోవడమే కాక ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని వివరించాలని సూచించారు. ప్రజలు వారి సమస్యలను నేరుగా చెప్పుకునేలా ప్రతీ గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను గ్రామాల్లో ప్రతి గడపకూ చేరవేసే కార్యక్రమం తీసుకుంటున్నామన్నారు. కాగా, బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం, కమిటీల ఏర్పాటు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సమాయత్తంపై చర్చించగా.. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందున సమ్మె విరమించాలని సత్యనారాయణ కోరారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ బాధ్యులు తూములూరి లక్ష్మీనరసింహారావు, మలీదు హైమావతి, వేమిరెడ్డి సుధాకర్రెడ్డి, కాపా సుధాకర్, కళ్లెం వెంకటరెడ్డి, కిలారి అనిల్కుమార్, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, కంచర్ల వెంకటనర్సయ్య, రామసహాయం హరితారెడ్డి, పులిబండ్ల చిట్టిబాబు, దొడ్డా పుల్లయ్య, బానోతు రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్


