ఖమ్మంఅర్బన్: ఖమ్మంకు మరింత ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేలా ఇస్కాన్ ఆలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 4–30 ఎకరాల భూమి ని కేటాయించింది. రఘునాథపాలెం మండల పరిధిలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘానికి ఈ భూమి కేటాయిస్తూ గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఆమోదం తెలిపారు. బలరామ, కృష్ణ ఆలయంతో పాటు ఆశ్రమం, భజన మందిరం నిర్మాణానికి జీఓ 571 ద్వారా మార్కెట్ విలువ ఆధారంగా భూమి కేటాయిస్తారు.
కలెక్టర్ ద్వారా ప్రతిపాదనలు
రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో ఇస్కాన్ ఆలయ నిర్మాణానికి కలెక్టర్ ప్రతిపాదనలు సమర్పించారు. ఈమేరకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ పరిశీలించి ప్రభుత్వానికి నివేదించగా మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు. ఈ స్థలంలో ఆలయంతో పాటు గోశాల, నిత్యాన్నదాన సత్రం నిర్మించడమే కాక కాక యోగా, ధ్యానం శిక్షణ, భగవద్గీత బోధన నిర్వహించనున్నారు. అంతేకాక యువత, మహిళలకు వ్యక్తిత్వ వికాసం, సాధికారత, సహజ వ్యవసాయంపై అవగాహన కల్పించాలనే ప్రతిపాదనలు ఉన్నాయని సంస్థ బాధ్యులు చెబుతున్నారు. ఈమేరకు సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రివర్గానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి పొంగులేటి పూజలు
కూసుమంచి: మండలంలోని లింగారం తండాలో శ్రీ ఆభయాంజనేయ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పూజలు చేశారు. గ్రామస్తులు పాడిపంటలు, సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. సర్పంచ్ పుష్పవతి, గ్రామస్తులు పాల్గొన్నారు.
చార్ధామ్ యాత్రికులు జాగ్రత్తలు పాటించాలి
ఖమ్మంవైద్యవిభాగం: ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్రకు వెళ్తున్న జిల్లావాసులు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించాలని డీఎంహెచ్ఓ రామారావు సూచించారు. విపరీతమైన చలి, ఆక్సిజన్, గాలి పీడనం ఉండటం వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈమేరకు యాత్ర మొదలయ్యే నెల ముందు నుంచే ప్రతిరోజూ 20 – 30 నిమిషాల నడక, 5 – 10 నిమిషాల శ్వాస వ్యాయామాలు అలవాటు చేసుకోవాలని, 55 ఏళ్లు పైబడిన, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు వైద్యులు అనుమతి ఇస్తేనే యాత్ర ప్రారంభించాలని చెప్పారు. ఉన్ని దుస్తులు, రెయిన్ కోట్లు, పల్స్ ఆక్సిమీటర్, థర్మామీటర్ వెంట తీసుకెళ్లడమే కాక ప్రతీ రెండు గంటలకు ఒకసారి 5 – 10 నిమిషాల విరామం తీసుకోవాలని, రోజుకు కనీసం రెండు లీటర్ల నీరు తాగుతూ పోషకాహారం తీసుకోవాలని తెలిపారు. అత్యవసర పరిస్థితిలో 104 హెల్ప్లైన్ నంబర్కు ఫోన్ చేయాలని డీఎంహెచ్ఓ ఓ ప్రకటనలో సూచించారు.
అవార్డుల కోసం
నామినేషన్లు ఆహ్వానం
ఖమ్మంమయూరిసెంటర్: ఉత్తమ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న పరిశ్రమలు, సంస్థలకు మే డే సందర్భంగా రాష్ట్రప్రభుత్వం అవార్డులు ప్రకటించనుందని కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ విజయభాస్కర్ తెలిపారు. ఈమేరకు అర్హత కలిగిన సంస్థల యాజమాన్యాలు ఈనెల 27వ తేదీలోగా జిల్లా ఉప కమిషనర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందజేయాలని సూచించారు.
పనుల్లో వేగం పెరగాలి..


