
విద్యుదాఘాతంతో యువకుడు మృతి
కొణిజర్ల: ట్రాక్టర్ ట్రక్కుకు వెల్డింగ్ చేస్తుండగా విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన శనివారం రాత్రి మండలంలోని తనికెళ్లలో చోటుచేసుకుంది. ఎస్ఐ సూరజ్ కథనం ప్రకారం.. మండలంలోని తనికెళ్ల శివారులో షేక్ జిలానీ వెల్డింగ్ షాపు నిర్వహిస్తున్నాడు. అందులో కొణిజర్లకు చెందిన బండారు శివ (23) పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి వెల్డింగ్ చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్కు గురవగా.. ఖమ్మం తరలిస్తున్న క్రమంలో మృతి చెందాడు. మృతుడికి తల్లి, చెల్లి ఉన్నారు. తండ్రి గతంలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడి తల్లి ముత్తమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.
పేకాట స్థావరంపై దాడి
చింతకాని: మండలంలోని రామకృష్ణాపురం బస్టాండ్ సమీపంలోని మున్నేరు ఒడ్డున పేకాట ఆడుతున్న మండలంలోని పందిళ్లపల్లి, బొప్పారం, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని ధంసలాపురం గ్రామాలకు చెందిన ఏడుగురు వ్యక్తులను చింతకాని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.19,640 నగదు, ఏడు సెల్ఫోన్లు, ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నాగుల్మీరా తెలిపారు.
తుమ్మల చెరువులో పర్యాటకుల పాట్లు
అశ్వాపురం: మండల పరిధిలోని తుమ్మలచెరువు వద్ద బోటింగ్ వద్ద తగిన సౌకర్యాలు లేక పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. చెరువు వద్ద రెండు చిన్న బోట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో జలవిహారం చేసేందుకు పర్యాటకులు గంటల తరబడి వేచి ఉండాల్సివస్తోంది. వసతి, తాగునీటి, చిన్న పిల్లలకు స్నాక్స్ వంటి సౌకర్యాలు కూడా లేవు. తుమ్మలచెరువు వరకు రహదారి కూడా సక్రమంగా లేదు. అధికారులు స్పందించి పర్యాటకులకు తగిన సౌకర్యాలు కల్పించాలని, పార్క్ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.

విద్యుదాఘాతంతో యువకుడు మృతి