‘సహకారం’ సరికొత్తగా.. | - | Sakshi
Sakshi News home page

‘సహకారం’ సరికొత్తగా..

Jun 3 2025 12:28 AM | Updated on Jun 3 2025 12:28 AM

‘సహకారం’ సరికొత్తగా..

‘సహకారం’ సరికొత్తగా..

● పీఏసీఎస్‌ల్లో ఎఫ్‌పీఓ సంఘాలు ● భద్రాద్రి జిల్లాలో 11 పీఏసీఎస్‌ల ఎంపిక ● రైతుల ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యం

బూర్గంపాడు: రైతుల ఆర్థిక ప్రయోజనాలను మెరుగుపరిచేందుకు, పంటల సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌పీఓ (ఫార్మేషన్‌ అండ్‌ ప్రమోషన్‌ ఆఫ్‌) సంఘాలను ఏర్పాటు చేస్తోంది. దేశ వ్యాప్తంగా 10 వేల ఎఫ్‌పీఓలు ఏర్పాటు చేసి వ్యవసాయ రంగాన్ని పునరుద్ధరించే లక్ష్యంతో 2020లో కేంద్రం దీనికి శ్రీకారం చుట్టింది. కంపెనీల చట్టం, సహకార చట్టం కింద నమోదైన సంఘాల్లోని సభ్యులతో ఎఫ్‌పీఓలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో భద్రాద్రి జిల్లాలోని 21 పీఏసీఎస్‌లకు గాను తొలివిడతగా 11 సొసైటీల్లో ఎఫ్‌పీఓ సంఘాల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. జిల్లాలోని పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, గుండాల, దుమ్ముగూడెం, చర్ల, గానుగపాడు, గుంపెన, కొత్తగూడెం, జూలూరుపాడు పీఏసీఎస్‌లకు ఇందులో స్థానం దక్కింది.

సభ్యులుగా 750 మంది రైతులు..

ఎఫ్‌పీఓ సంఘంలో 750 మంది రైతులు సభ్యులుగా ఉంటారు. ఒక్కొక్కరు రూ. 2000 చొప్పున వాటాధనం చెల్లించి సభ్యులుగా చేరాలి. రైతుల ఈక్విటీగా మొత్తం రూ.15 లక్షలు జమచేస్తే, కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్‌గా రూ.15 లక్షలు అందిస్తుంది. ఎఫ్‌పీఓలకు బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లను, పాలకమండలిని కూడా ఎన్నుకోవాలి. ఎఫ్‌పీఓలలో సగం మంది సన్న, చిన్నకారు రైతులతో పాటు మహిళా రైతులకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలి. ఎఫ్‌పీఓల నుంచి 18 నెలల వ్యాపార ప్రణాళిక, బడ్జెట్‌తో వ్యవసాయ సంబంధిత వ్యాపారాలు చేపట్టాలి. రైతులకు అవసరమైన వ్యవసాయ పరికరాలు, యంత్ర పరికరాలను తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకురావడం, రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేయడం వంటి వ్యాపారాలను ఎఫ్‌పీఓలు చేపట్టాల్సి ఉంటుంది. విత్తనోత్పత్తి, తేనెటీగలు, పుట్టగొడుగుల పెంపకం వంటి అధిక ఆదాయం వచ్చే ఉత్పత్తులపై దృష్టి పెట్టాలి.

ఆదాయం పెంపే లక్ష్యంగా..

ఎఫ్‌పీఓలతో వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన వ్యాపారాలను విస్తృతపరచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌, సాగుకు అవసరమైన యంత్ర పరికరాలు, వ్యవసాయ పనిముట్ల విక్రయాలు చేపట్టాలని భావిస్తోంది. ఉద్యానవన పంటల మార్కెటింగ్‌, పశుపోషణ, జీవాల పెంపకాలకు అవరమైన వసతులు కల్పించడం వంటి పనులు నిర్వహించి ఆదాయాన్ని పెంచుకోవటమే లక్ష్యంగా ఎఫ్‌పీఓలు పనిచేయాల్సి ఉంది. ఎఫ్‌పీఓల ఆదాయ, వ్యయాలను పర్యవేక్షించేందుకు అవసరమైన అధికారులు, సిబ్బందిని కూడా ఏర్పాటు చేయనున్నారు.

విత్తనాలు, ఎరువుల విక్రయం..

ఇప్పటికే పీఏసీఎస్‌లు రైతులకు వ్యవసాయ రుణాలు అందించడంతో పాటు విత్తనాలు, ఎరువులు విక్రయిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల బాధ్యతను కూడా పీఏసీఎస్‌లకే అప్పగించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కుదేలయ్యాయి. రైతులు తీసుకున్న అప్పులు చెల్లించక ఆర్థికంగా దెబ్బతిన్నాయి. వైఎస్‌ ముఖ్యమంత్రి అయ్యాక రైతుల వ్యవసాయ రుణాలు, బంగారం తాకట్టు రుణాలు పూర్తిస్థాయిలో మాఫీ చేయడంతో సహకార రంగం ఊపిరి పీల్చుకుంది. ఆయన హయాంలోనే పీఏసీఎస్‌లను బలోపేతం చేసేందుకు ఎరువులు, విత్తనాల విక్రయాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి పీఏసీఎస్‌లు బలోపేతం కాసాగాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌పీఓ సంఘాలు ఏర్పాటు చేస్తుండడంతో మరింత ఆర్థిక పరిపుష్టి సంతరించుకోనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement