
లారీని ఢీకొట్టిన బస్సు.. తప్పిన ప్రమాదం
తిరుమలాయపాలెం: టైర్ పంక్షర్ కావడంతో రోడ్డు పక్కన నిలిపిన లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టగా తృటిలో పెనుప్రమాదం తప్పింది. బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో 10మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తొర్రూరు డిపోకు చెందిన ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు సోమవారం సాయంత్రం ఖమ్మం వస్తోంది. పిండిప్రోలు సమీపాన కాశీపట్నం వద్ద టైర్ పంక్షర్ అయి ఆగిన లారీని తప్పించే క్రమంలో ఢీకొట్టి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో స్వల్పంగా గాయాలైన 10 మంది ప్రయాణికులను 108లో ఖమ్మం తరలించారు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.