
సిద్ధమైన నమూనా గృహం
రఘునాథపాలెం: రఘునాథపాలెం తహసీల్ ఆవరణలో ఇందిరమ్మ నమూనా ఇంటి నిర్మాణం పూర్తయింది. మండలంలో మల్లేపల్లిని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి 19మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. అయితే, వడపోత తర్వాత 13 మందినే ఎంపిక చేయగా ముగ్గురు ఇంటి నిర్మాణానికి ముందుకు రాలేదు. మిగతా 10మంది ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. అయితే, దశల వారీగా అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయనుండడంతో ప్రభుత్వం ఇచ్చే రూ.5లక్షలతో నిర్మించుకునేలా అవగాహన కోసం తహసీల్ ఆవరణలో నమూనా గృహాన్ని నిర్మించారు.
ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా విధులు
ఖమ్మం సహకారనగర్: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం, ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించడమే లక్ష్యంగా ఉద్యోగులు విధులు నిర్వర్తించాలని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) డాక్టర్ పి.శ్రీజ సూచించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో సోమవారం ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం శ్రీజ మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజలు, ఉద్యోగుల ఉద్యమంతో తెలంగాణ సిద్దించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్(రెవెన్యూ) పి.శ్రీనివాసరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఏ.పద్మశ్రీ, ఎస్డీసీ ఎం.రాజేశ్వరి, కలెక్టరేట్ ఏఓ ఎన్.అరుణ, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట
ఖమ్మంరూరల్: అక్రమంగా పశువుల రవాణాను అడ్డుకునేలా విస్తృత తనిఖీలు చేపట్టాలని అడిషనల్ డీసీపీ ప్రసాద్రావు సూచించారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. రూరల్ మండలం వెంకటగిరి క్రాస్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టును డీసీపీ సోమవారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయడమే కాక పశువులను తరలిస్తున్నట్లే తేలితే అనుమతి పత్రాలు పరిశీలించాలన్నారు. సరైన పత్రాలు లేకపోతే సీజ్ చేయాలని ఆదేశించారు. కాగా, నిబంధనలకు విరుధ్ధంగా పశువుల రవాణా జరుగుతున్న తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలే తప్ప ఎవరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని ఆయన ఈ సందర్భంగా సూచించారు.
కాకతీయుల
కాలం నాటి శిలాశాసనం
నేలకొండపల్లి: మండలంలోని అనాసాగారంలో కాకతీయుల నాటి శిలాశాసనాన్ని గుర్తించారు. గ్రామ పాత బొడ్రాయి సెంటర్లో రావిచెట్టు వద్ద ఈ శాసనం వెలుగుచూసింది. నాలుగు అడుగుల పొడవు, అడుగు మందంతో ఉన్న నల్లరాతి బండపై ఓ వైపున 19 పంక్తులతో తెలుగు లిపిలో రాసి ఉన్న శాసనాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కోకన్వీనర్ కట్టా శ్రీనివాస్ నేతృత్వాన సోమవారం గుర్తించారు. శాసనంపై శివలింగం, దానికి రెండువైపులా సూర్యచంద్రుల చిహ్నాలు ఉన్నాయి. మహామండలీశుడు కాటేయ(రుద్రసేనాని కొడుకు) రాజ్యం ఏలుతున్నప్పుడు గోవిందమాంబ, దేవశెట్టి కొమ్మోజు తవ్వించిన రుద్రసముద్రానికి ఎకరంన్నర భూదానం చేసినట్లు ఈ శాసనం తెలుపుతోందని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బృందం కన్వీనర్ హరగోపాల్, గ్రామ పెద్దలు వున్నం వెంకయ్య, పసుమర్తి శ్రీనివాస్, తిరుమల్, షేక్ రహీముతుల్లా తదితరులు పాల్గొన్నారు.

సిద్ధమైన నమూనా గృహం

సిద్ధమైన నమూనా గృహం