
మా బతుకులు రోడ్డున పడ్డాయి..
● ఆర్సీహెచ్పీకి బొగ్గు లోడింగ్ నిలిపివేయాల్సిందే.. ● ఆందోళనకు దిగిన లారీల యజమానులు ● నాణ్యమైన బొగ్గు ఇవ్వడం లేదని ఆవేదన
సత్తుపల్లి: నాణ్యమైన బొగ్గు ఇవ్వకపోవడంతో... కొనుగోలుదారులు మహారాష్ట్ర, ఒడిశా గనులకు వెళ్తున్నారని తద్వారా తమకు లోడింగ్ లేక జీవనాధారం కోల్పోతున్నామని సత్తుపల్లికి చెందిన లారీల యయజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. సత్తుపల్లి మండలంలోని ఓసీల్లో నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి అవుతున్నా రుద్రంపూర్ కోల్ హ్యాడ్లింగ్ ప్లాంట్(ఆర్సీహెచ్పీ) ద్వారా ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తూ తమ బతుకులను రోడ్డున వేశారని మండిపడ్డారు. ఈమేరకు కిష్టారం ఓసీ వద్ద సోమవారం ఆందోళనకు దిగడమే కాక ఆర్సీహెచ్పీ కి వెళ్లే టిప్పర్లను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడి భూమిలో బొగ్గు ఉత్పత్తి చేస్తుండగా, ఆంధ్రా కాంట్రాక్టర్లకు లబ్ధి జరిగేలా యాజమాన్యం, అధికారులు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
సమస్య ఏమిటంటే...
ఓసీల ఏర్పాటుకు భూములు ఇచ్చిన నిర్వాసితులు, స్థానికులు జీవనాధారం కోసం లారీలు కొనుగోలు చేశారు. వీరికి రోజు 6వేల టన్నుల బొగ్గు లోడింగ్ ఇస్తామని పలుమార్లు అధికారులు తెలిపారు. అయితే, ఆచరణలో మాత్రం రోజుకు కేవలం 2వేల నుంచి 2,500 టన్నులు మాత్రమే ఇస్తుండడంతో 30 లారీలకే లోడింగ్ వస్తోంది. సత్తుపల్లిలో మొదటగా 650 లారీలు ఉండగా.. సరైన లోడింగ్ అందక సకాలంలో ఫైనాన్స్ కిస్తీలు చెలిం్లచక ఒక్కొక్కరు అమ్ముకుంటూ రావడంతో ఆ సంఖ్య ప్రస్తుతం 450కి పడిపోయింది.
నాణ్యమైన బొగ్గు ఇవ్వకపోవడంతోనే..
సత్తుపల్లి జేవీఆర్, కిష్టారం ఓసీల్లో జీ–8, 9, 11, 13, 15, 16 రకం బొగ్గు ఉత్పత్తి అవుతోంది. ఇందులో జీ–8, 13 నాణ్యమైనది కావడంతో మంచి డిమాండ్ ఉంది. కానీ నాణ్యమైన బొగ్గును కావాల్సిన కంపెనీలకు కాక రుద్రంపూర్ కోల్ హ్యాడ్లింగ్ ప్లాంట్(ఆర్సీహెచ్పీ) ద్వారా ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ఈక్రమాన సింగరేణి క్వాలిటీ మేనేజర్ తీరుతో వివిధ కంపెనీల బాధ్యులు ఆర్డర్లు రద్దు చేసుకుని మహారాష్ట్ర, ఒడిశా గనులకు వెళ్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కర్ణాటకకు చెందిన ఓ ప్రాజెక్టు నుంచి 5వేల టన్నులు ఆర్డర్ చేస్తే.. బొగ్గు లోడింగ్ ఇవ్వలేదని సమాచారం.
తాత్కాలిక అనుమతితో రవాణా
రుద్రంపూర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్(ఆర్సీహెచ్పీ)కు రోడ్డు మార్గాన టిప్పర్ల బొగ్గు రవాణా చేసేందుకు గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయినా ఓసీ ల్లో బొగ్గు ఉత్పత్తి అధికంగా ఉందని, నిల్వ చేస్తే మంటలు వస్తున్నాయని సాకు చూపి తాత్కాలిక అనుమతితో రవాణా చేస్తున్నారు. ఏడాది దాటినా ఆర్సీహెచ్పీకి నిరంతరాయంగా బొగ్గు రవాణా చేస్తుండడంతో స్థానిక లారీ లకు లోడింగ్ అందడంలేదు. ఇకపై ఆర్సీహెచ్పీకి లోడింగ్ అడ్డుకుంటామని లారీల యజమానులు చెబుతున్నారు.
జూలై నుంచి ఇస్తాం..
బొగ్గు కాంట్రాక్టు ఆర్డర్లు లేకపోవడంతోనే లోడింగ్ ఇవ్వలేకపోతున్నామని.. వచ్చే జూలై నుంచి లోడింగ్ పెంచుతామని కిష్టారం, సత్తుపల్లి జేవీఆర్ ఓసీ పీఓలు నర్సింహారావు, ప్రహ్లాద్ లారీల యజమానులకు హామీ ఇచ్చారు. యజమానుల ఆందోళనతో వారు యూనియన్ కార్యాలయంలో చర్చించినా వారి సమాధానంతో సంతృప్తి చెందలేదు. మరో దఫా చర్చలు జరిపి లోడింగ్లు పెంచే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఆందోళలో లారీ యూనియన్ బాధ్యులు కొండపల్లి రమేష్రెడ్డి, ఎస్.కే.మౌలాలీ, కోట మోహన్రావు, చిన్నంశెట్టి సూరిబాబు, ఎస్.కే.మస్తాన్, ఎస్.కే.ఖలీల్, దురిశేటి శ్రీనివాసరావు, కొండపల్లి క్రాంతిరెడ్డి, చిలుకూరి మోహన్రెడ్డి పాల్గొన్నారు.